ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి గుట్టును రట్టుచేశారు. చెంబుకి కెమికల్స్ అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. దీనిని నమ్మేశారు అమాయక జనం.
యూట్యూబ్ లో చూసి మోసాన్ని ఎలా చేయాలో నేర్చుకుంది ముఠా. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఠాను కాంటాక్ట్ చేశారు. అంతే వీరి బుట్టలో పడ్డాడా వ్యక్తి. ఒకటిన్నర లక్షకు చెంబును అమ్మేసింది ముఠా. అయితే తాను మోసపోయానని తర్వాత తెలుసుకున్నాడా వ్యక్తి. చెంబుకి ఎటువంటి శక్తులు లేకపోవడంతో తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హేమంత్ కుమార్ తో పాటు విజయ్ కుమార్,నాగరాజులను అరెస్టు చేసి ఒకటిన్నర లక్ష నగదు,చెంబుని స్వాధీనం చేసుకున్నారు. రెండు తలల పాములు, చెంబుల పేరుతో కేటుగాళ్ళు చేస్తున్న మోసాలపై అవగాహన కలిగి వుండాలని, ఈరోజుల్లో ఇలాంటివి నమ్మకూడదని సలహా ఇస్తున్నారు పోలీసులు.