మనదేశ కరెన్సీ విలువ రానురాను పడిపోతోంది. భారత రూపాయి ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత పేలవమని కరెన్సీగా నమోదయిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుత త్రైమాసికంలో రూపాయి విలువ 2.2 శాతం పైగానే క్షీణించింది. రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. ఒమిక్రాన్ వైరస్ భయాలకు తోడు గ్లోబల్ మార్కెట్లలోనూ ప్రతికూలతలే ఇందుకు కారణం.
ఇదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న సంకేతాలు రూపాయిని మరింత బలహీనపర్చాయని నిపుణులు అంటున్నారు. వచ్చే మార్చి ముగింపు నాటికి డాలర్తో రూపాయి మారకం విలువ 78కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఏడాదిలో రూపాయి విలువ 4 శాతం కోల్పోవడంతో.. వరుసగా నాలుగో సంవత్సరం ఈ కరెన్సీ విలువ భారీగా పడిపోయినట్లయ్యింది.
