ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో 58,097 కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదవ్వగా ఒక్కరోజులో కొత్తగా 20 వేలకు పైగా కేసులు పెగరడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. ఇది అందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక 24 గంటల్లో 15,389 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా భారీగా పెరిగింది. 24 గంటల్లో కరోనాతో 534 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ పేర్కొన్నది. ప్రస్తుతం ఇండియాలో 2,14,004 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు మొత్తం 3,43,21,803 మంది కోలుకున్నారు.
Read: కరోనా టెర్రర్… మెడికల్ కాలేజీలో 143 మంది డాక్టర్లకు పాజిటివ్
ఇప్పటి వరకు 4,82,551 మంది కరోనాతో మృతిచెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. న్యూఇయర్ వేడుకల తరువాత కేసులు భారీగా నమోదవుతున్నాయి. వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. కొత్త సంవత్సరం వేడుకల తరువాత కేసులు మూడు రెట్లు వరకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ను మరింత వేగంవంతం చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు 147.72 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.
