యువతులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. తమకు ఇష్టం లేకపోయినా వేధించడం ఎక్కువైంది. హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్న యువతి(26)రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. బండ్లగూడ సమీపంలోని సన్సిటీలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు పరిచయం ఉన్న రవికిరణ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెను వెంబడించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించడంతో రాయదుర్గం పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
ఇదిలా ఉండగా ఈ నెల 24న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని గాయత్రీహిల్స్లో బ్యూటీ పార్లర్కు వచ్చింది యువతి. అక్కడికి వచ్చిన రవికిరణ్ ఆమెని బయటకు లాక్కొచ్చి వేధించాడు. అంతేకాదు, తనతో పాటు రావాలని కారులోకి లాక్కున్నాడు రవికిరణ్. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తప్పించుకుని పారిపోయింది. ఈ మేరకు బాధితురాలు శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు రవికిరణ్పై ఐపీసీ 354(ఏ), (డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.