మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోమారు తన ప్రత్యేకత చాటుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రైతులకు మద్దతుగా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలపై విమర్శలు గుప్పించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ మాట్లాడారు.
దేశంలో అమలులోకి వచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకగా జరుగుతున్న రైతుల నిరసనపై తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతోందన్నారు. అలా మాట్లాడిన ప్రతిసారి ఢిల్లీ పెద్దల నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఆలోచించాల్సి వస్తోందన్నారు. ఓ శునకం చనిపోయినా సంతాపం తెలిపే ఢిల్లీ నేతలు సుదీర్ఘంగా సాగుతున్న నిరసనల్లో 600 మంది రైతులు మరణించినా ఆ విషయం పట్టించుకోకపోవడం ఏంటన్నారు.
లోక్సభలో వారి ప్రస్తావన కూడా తీసుకురావడం లేదంటని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్లాన్ను కూడా మాలిక్ విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవనానికి బదులు ప్రపంచ స్థాయి కళాశాలను నిర్మిస్తే బాగుంటుందన్నారు. తానేదైనా విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పదవి కోల్పోవాలని ఎదురుచూస్తున్నారని అన్నారు. తనకున్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తానని, అలాగని పదవి పోతుందంటే నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్లిపోతానని సత్యపాల్ మాలిక్ అన్నారు.