అవకాశం చిక్కితే అడ్డంగా దోచేందుకు కొందరు కేటుగాళ్ళు రెడీ అయిపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ ముఠా నకిలీ ఇన్స్యూరెన్స్ల పేరిట భారీగా మోసాలకు పాల్పడింది. ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా వెలుగులోకి వచ్చింది. తీగ లాగిన పోలీసులు పలు అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాలలో దళారులుగా పనిచేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారుచేశారు. మోసాలకు పాల్పడ్డారు. ఈ దందాలో ప్రమేయం వున్న 10 మందిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.
నకిలీ వాహన బీమా పాలసీలు చేసే ముఠా గుట్టు రట్టు చేశారు వరంగల్ పోలీసులు. దీనికి సంబంధించి రెండు ముఠాలకు చెందిన ఇద్దరు దళారులతోపాటు 10 మందిని అరెస్టు చేశారు. మొబైల్ యాప్ ద్వారా డాక్యుమెంట్లు డౌన్ లోడ్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా దొరకకుండా ఫేక్ బీమా పాలసీలు, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ తయారు చేస్తారు.
ఈవిధంగా రెండేళ్లలో 90 లక్షల రూపాయల విలువ చేసే 2 వేల నుంచి పది వేల డాక్యుమెంట్లు తయారు చేశారు. అయితే వీరి బారిన పడి మోసపోయిన వాహనదారుడి ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కార్యాలయాలపై దాడులు నిర్వహించడంతో పది మంది పట్టుబడ్డారని సీపీ తరుణ్ జోషి తెలిపారు. నిందితుల నుంచి 4లక్షల 46వేల రూపాయల నగదు, 3 ల్యాప్ టాప్ లు, 2 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, ఐదు ద్విచక్ర వాహనాలు, 433 వాహన ఆర్సీలు, లైసెన్స్ కార్డులు, రబ్బర్ స్టాంప్ లు, నకిలీ భీమా పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఇందులో ఆర్టీఏ అధికారులు ప్రమేయం వుందా అనే కోణంలో అరా తీస్తున్నాం అని తెలిపారు.
నిందితుల్లో మామిడి రాజు, ఉమ్మడి నిఖిల్, నాగమల్ల శివ ప్రసాద్, అల్లడి రాజేష్ గుండెబోయిన శ్రీకాంత్ లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు దళారులు రాజకుమార్, బొల్లినేని సుమన్, ఆర్టిఏ కార్యాలయంలో డీబీఏలుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రఘు తోపాటు గతంలో పనిచేసిన సునీల్ పరారయ్యారు. నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న కంప్యూటర్ సెంటర్స్ నుంచి పెద్ద ఎత్తున నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు, స్మార్ట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.