దేశ రాజధాని ఢిల్లీ గురువారం నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉండే కోర్టులో పేలుడు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారి పేలుడు చోటుచేసుకుంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై విశ్లేషించారు. ఓ గదిలో ఉన్న బ్యాగులోని ల్యాప్టాప్ పేలిందని.. ల్యాప్టాప్లోని బ్యాటరీలే పేలుడుకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించామన్నారు.
Read Also: కోహ్లీకి వన్డే కెప్టెన్సీ పోవడానికి ఆ 48 గంటలే కారణమా?
కాగా ఉదయం 10:30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిందని.. భారీగా శబ్ధం వినిపించడంతో అందరూ బాంబు అని భయపడిపోయారని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలు అన్నీ నిలిపివేశామన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్ఎస్జీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ల్యాప్టాప్ పేలిందని తెలుసుకున్న స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ల్యాప్టాప్ పేలి నేలపై పడిఉన్న వీడియోలు, ఫోటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి.
