తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిఎం కెసిఆర్ పై బహిరంగంగానే ఈటల కామెంట్స్ చేశారు. అంతేకాదు అన్ని పార్టీల నేతలను ఈటల కలుస్తున్నారు. 2023 లో టీఆర్ఎస్ ను పడగొట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈటల. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఈటల కలిశారు. తన రాజకీయ భవిష్యత్తుపై కిషన్ రెడ్డితో ఈటల చర్చించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఈటల కలవడం మరో చర్చకు దారితీసింది.