మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాల గనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవడం మామూలే. అయితే తాజాగా మరో కూలీని అదృష్టం వరించింది. దీంతో ఆ కూలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గిరిజన కూలీ అయిన ములాయం సింగ్కు జీవితం రోజువారీ పోరాటం. తన పిల్లలను చదివించుకోవటం, ఇళ్లు గడపడం చాలా కష్టంగా మారింది.
అయితే, మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పన్నా వజ్రాల గనుల్లోని నిస్సార గనిలో రూ. 60 లక్షల విలువైన 13 క్యారెట్ల వజ్రం లభించడంతో అతని అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయిందని ఓ అధికారి బుధవారం తెలిపారు. “ములాయం సింగ్ కనుగొన్న వజ్రం బరువు 13.54 క్యారెట్లు, దీని విలువ కనీసం 60 లక్షల రూపాయలు” అని డైమండ్ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్ తెలిపారు. సింగ్తో పాటు, ఇతర కార్మికులు వేర్వేరు బరువుల ఆరు వజ్రాలను కనుగొన్నారని అధికారి తెలిపారు.
ఈ ఆరు వజ్రాలలో రెండు వజ్రాలు వరుసగా 6-క్యారెట్ మరియు 4-క్యారెట్ బరువు కలిగి ఉండగా, మరికొన్ని వరుసగా 43, 37 మరియు 74 సెంట్లు బరువు కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ వజ్రాల మొత్తం విలువ కోటి రూపాయలు దాటే అవకాశం ఉందని, వేలంలో అసలు ధర తెలుస్తుందని అధికారి తెలిపారు. తన విలువైన ఆస్తిపై హర్షం వ్యక్తం చేసిన ములాయం సింగ్, “వజ్రం వేలం ద్వారా వచ్చే డబ్బును నా పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తాను” అని అన్నారు.