వినూత్న నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దూసుకెళ్తున్నారు.. ఇప్పటికే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. నెటిజన్లు ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నారు.. మరో వైపు.. అసెంబ్లీలో తనను పొడిగేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చగా మారింది. ఇక, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టారు సీఎం స్టాలిన్.. నిన్న ఆర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్… అధ్యామాన్కోటై పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.. దీంతో.. పోలీసులంతా హడలిపోయారు.
అధ్యామాన్కోటై పీఎస్ను ఎప్పుడు నిర్మించారు.. ఎప్పుడు ప్రారంభించారు లాంటి వివరాలను తెలుసుకున్న సీఎం.. ఆ తర్వాత పీఎస్లోకి వెళ్లి ఎస్సై సీటులో కూర్చున్నారు.. పీఎస్లో నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.. ఇక, ఆ కేసులు ఎక్కడ వరకూ వచ్చాయి అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేసి, స్వీకరించిన పిటిషన్లు మరియు తీసుకున్న చర్యల గురించి పోలీసు సిబ్బందితో సంభాషించారు. ఉంగల్ తోకుతియిల్ మొదలైమైచర్ పథకం కింద వచ్చిన పిటిషన్లపై తీసుకున్న చర్యల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ఇక, పోలీసు సిబ్బంది బాగోగుల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా దాదాపు 15 నిమిషాలకు పైగా పీఎస్లో గడిపారు సీఎం స్టాలిన్. అయితే, ఇప్పుడా వీడియోలు, ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.
