కరోనా మమహమ్మారి నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును మరోసారి పొడిగించింది… వచ్చే నెల 31 (ఆగస్టు)వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం.. మరోవైపు ఇప్పటికీ కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక, కరోనా కేసులు తగ్గినప్పటికీ నిబంధనలు పాటించాలని పేర్కొంది.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం.. వరుసగా పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలను ప్రజలు పాటించేలా చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
ఇక, కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపుపై ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది కేంద్రం… కరోనా సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉండాలని పేర్కొంది. కాగా, తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. మరోవైపు.. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయిపోయిందనే వార్తలు కూడా ప్రజలను భయపెడుతున్నాయి.