ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ మంగళవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ఇటీవల నీతి ఆయోగ్తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. ఆ ప్రకారమే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని చెప్పారు.
ఏపీ విభజన చట్టంలో నిర్దేశించిన హామీలను నెరవేర్చే బాధ్యత ఉన్నందున ఏపీ అభివృద్ధికి సాయపడాలని ఆర్థిక సంఘాలు, నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సిఫార్సు చేశాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. దీంతో అవశేష ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనికి అనుగుణంగానే రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి కింద 2015-16 నుంచి 2019-20 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చిందన్నారు. 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ ప్రాజెక్ట్ల కింద చేపట్టిన వాటికి రుణం సమకూర్చడంతోపాటు ఆ రుణంపై వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఈ విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.19,846 కోట్లను విడుదల చేసిందన్నారు. అలాగే వివిధ ఆర్థిక సంఘాలు చేసిన సిఫార్సులను అనుసరించి 2015-20 మధ్య కాలానికి రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.22,112 కోట్లు, 2020-21లో రూ.5,897 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు వెల్లడించారు.
