అమరావతిని ఏకైక రాజధానిగా వుంచాలంటూ రైతులు, ప్రజాసంఘాలు మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొననున్నారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. పాదయాత్రలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరీ, సత్య కుమార్ పాల్గొని సంఘీభావం తెలపాలని నిర్ణయించారు.
రాజధాని రైతులను కలిసి సంఘీభావం తెలుపుతామని ఏపీ బీజేపీ అగ్ర నేతలు ప్రకటించారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొనాలని ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాజధాని రైతుల పాదయాత్ర ఏపీలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల ముందుకు సాగడం లేదు. రైతుల మహా పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం రెండు రోజులుగా ప్రకాశం జిల్లా గుడ్లూరులో ఆగింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో యాత్రకు విరామం ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించిన తేదీకల్లా తిరుమల చేరుతామని రైతులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
స్థానిక జేఏసీ నేతలు పాదయాత్రలోని రైతులకు, మహిళల వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైతులంతా స్థానిక కల్యాణ మండపాల్లో బస చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ వారు నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుపై మోడీ నిర్ణయం తీసుకున్నట్లే మూడు రాజధానులకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నేతలు కోరారు. అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ నేతలు మద్దతు తెలపడంతో వారేం మాట్లాడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.20 రోజులుగా ఈ యాత్ర అప్రతిహతంగా సాగుతోంది. మొత్తం 45 రోజుల పాటు యాత్ర సాగనుంది. తిరుమలలో యాత్ర ముగుస్తుంది.