గత రెండు రోజులుగా తెలంగాణ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్గా మారింది. అయితే బండి సంజయ్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ బీజేపీ నేడు సికింద్రాబాద్లోని మహత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిచేందుకు పిలుపు నిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఢిల్లీ నుంచి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్కు చేరుకున్న జేపీ నడ్డాను ఆహ్వానించేందుకు కొందరినీ మాత్రమే ఎయిర్పోర్ట్లోకి అనుమతించారు.
అయితే అనుమతించిన వారిలో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు లేకపోవడంతో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేపీ నడ్డాకి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కి రావాలని నన్ను పిలిచారు. రిసీవ్ చేసుకునే వారి లిస్ట్ లో నా పేరు లేదు. ఎలాంటి పోస్ట్ లేని వారికి అనుమతి ఇచ్చారు. నాకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఈ అంశం నాకు బాధ కలిగించింది. బండి సంజయ్ కోసం భరిస్తాను అని ఆయన వెల్లడించారు.
