NTV Telugu Site icon

అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం.. వైసీపీకి అచ్చెన్నాయుడు కౌంటర్‌

రెండు రోజులుగా ఏపీ మొత్తం టీడీపీ, వైసీపీ ల నిరసనలతో అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయం అంటే దేవాలయం వంటిదని, ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. నేతల భాష విషయంలో జగన్ చర్చకు సిద్దమా..? అని సీఎం జగన్‌ కు సవాల్‌ విసిరారు. ఎవరేం మాట్లాడారో ప్రజలకు తెలుసునన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని, రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందనే ఆవేదనతో తెలుగుదేశం పోరాడుతుంటే దాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు మా నివాళులు అర్పిస్తామన్నారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసుల ఆత్మలు ఈ డీజీపీ తీరుతో ఘోషిస్తాయని, రెండున్నరేళ్లలో డీజీపీ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి కుట్ర పన్ని తొలుత చంద్రబాబు నివాసం పైకి దాడికి యత్నించారని, తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదని, సమాజ చైతన్యం కోసమే ఈ 36 గంటల దీక్ష అన్నారు.

టీడీపీని భూస్థాపితం చేయడం జగన్ నాయన వల్లే కాలేదని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలమని, అధికారంలోకి రాగానే ఏ మూల దాక్కున్నా లాగి లాగి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు భయపడేది లేదని, సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమవటంతో వైసీపీ కౌంటర్ దీక్షలకు దిగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో లభ్యమయ్యే నాసిరకం మద్యంలో మాదక ద్రవ్యాలు కలుపుతుని ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి గంజాయి కొత్త కాదని డీజీపీ మాట్లాడటం దుర్మార్గమని, ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేంత వరకు పోరాడతామన్నారు.