సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సంక్రాంతికి 6,970 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, జనవరి 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని, అదనపు సర్వీసులకు ప్రత్యేకంగా సర్వీస్ కోడ్ ఇచ్చామన్నారు. 9 వేల సిరీస్తో సంక్రాంతి స్పెషల్ సర్వీసులు నడువనున్నాయన్నారు. డీజిల్ రేట్లు భారంగా మారాయని, సంక్రాంతి ప్రత్యేక బస్సులకు మాత్రమే 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మన ప్రాంతం వారు మన బస్సులను ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రయాణీకులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతీరోజు తెలంగాణ, కర్ణాటకల నుంచీ నాలుగు వేల బస్సులు వస్తాయని, రోజుకు సుమారుగా నాలుగువేల బస్సులుంటాయని ఆయన పేర్కొన్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో 60 శాతం, స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఇప్పటికే రిజర్వ్అయ్యాయని, ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచీ బస్సులు బయలుదేరతాయన్నారు. కాలనీలు, కూడళ్ళ వద్ద ప్రయాణీకులు ఎక్కువగా ఉంటే, అక్కడ నుంచే బస్సులు బయలుదేరుతాయిన ఆయన తెలిపారు.