ఒకప్పుడు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం.. కానీ ఆ తర్వాత ఆ అభిమానం చెదిరిపోయింది. వైసీపీలో చేరిన ఆ నేత కీలక పదవిని పొందారు. ఇప్పుడు చంద్రబాబుపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలతో దాడి చేస్తున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం. తాజాగా ఆయన చంద్రబాబుని చెడుగుడు ఆడేశారు.
చంద్రబాబు ప్రజల విశ్వాసం కొల్పోయారని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. మరో రెండు మూడు పర్యాయాలు జగనే ముఖ్యమంత్రి ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి జగన్ ముందుకు వెళుతున్నారని సీతారం ప్రశంసించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఉచిత హామీలిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఏం చేసారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు, సీఎం జగన్ ప్రభుత్వాల మధ్య అభివృద్ది, సంక్షేమంలో వ్యత్యాసం గురించి ఇంకోసారి మాటాడతానని తమ్మినేని అన్నారు. అధికారంలోకి వస్తే ఓటీఎస్ ఫ్రీ చేస్తామంటున్నారని, ఇంతవరకూ నిద్రపోయారా అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. అధికారం కోసం ఇచ్చిన వాగ్ధానాలు మర్చిపోయారని తమ్మినేని దుయ్యబట్టారు.