వైద్యారోగ్య శాఖపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ సేవలపై నిషేధం విధించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.. వైద్యారోగ్య శాఖలో కొత్తగా చేపట్టనున్న 14 వేలకు పైగా పోస్టుల భర్తీలో ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ, డీపీహెచ్ సెంటర్లలో మొత్తంగా 14,037 పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేసింది వైద్యారోగ్య శాఖ. ఇప్పటికే ఉన్న ఖాళీగా 7740 పోస్టులతో పాటు.. కొత్తగా 6297 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.. ఈ నెల 27వ తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.. డిసెంబర్ 21 తేదీ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేయాలని చేసేలా రిక్రూట్మెంట్ క్యాలెండర్ సిద్ధం చేసింది ప్రభుత్వం.. ఇక, అదనపు పోస్టుల భర్తీతో ప్రభుత్వంపై రూ. 676.83 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, నిన్న వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్యశాఖలో 14 వేలకు పైగా వివిధ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.