హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఉక్రెయిన్లో మరణించాడు. రష్యా తరపున ఉక్రెయిన్లో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన తన తమ్ముడిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకున్నారని మృతుడి సోదరుడు చెబుతున్నాడు. యువకుడికి కొన్ని రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత.. ఉక్రెయిన్కు ఫ్రంట్లైన్ వర్కర్గా పంపించారు. అక్కడ ఆ యువకుడు పోరాడుతూ మరణించాడు. యువకుడి మృతిని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
ఉక్రెయిన్ యుద్ధంలో హతమైన యువకుడిని రవి మౌన్గా గుర్తించారు. అతని స్వస్థలం హర్యానా రాష్ట్రం కైతాల్ జిల్లాలోని మాటౌర్ గ్రామ నివాసి. రవి జనవరి 13న రవాణా ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడని, అయితే ఆర్మీలో రిక్రూట్ అయ్యాడని రవి సోదరుడు అజయ్ పేర్కొన్నాడు. కాగా.. తన సోదరుడి గురించి సమాచారం ఇవ్వాలని అజయ్ జూలై 21న రాయబార కార్యాలయానికి లేఖ రాశాడు. అయితే.. తన సోదరుడు మరణించినట్లు రాయబార కార్యాలయం తమకు తెలియజేసిందని చెప్పాడు. మృతదేహాన్ని గుర్తించడానికి డీఎన్ఎ పరీక్ష నివేదికను కూడా పంపాలని రాయబార కార్యాలయం కోరిందని ఆయన చెప్పారు. రవి తమతో చివరిసారిగా మార్చి 12న మాట్లాడాడని సోదరుడు అజయ్ తెలిపాడు. మరోవైపు.. అజయ్ మౌన్ తన సోదరుడి మృతదేహాన్ని తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి తమ వద్ద తగినంత డబ్బు లేదని.. ఎకరం భూమిని అమ్మి రష్యాకు పంపడానికి కుటుంబం రూ.11.50 లక్షలు ఖర్చు చేసిందని చెప్పారు.
Read Also: Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రష్యా పర్యటన తర్వాత.. పుతిన్ ప్రభుత్వం తన సైన్యంలో పనిచేస్తున్న భారతీయ పౌరులను వెంటనే విడుదల చేసి, తిరిగి వచ్చేలా చూడాలని భారతదేశం చేసిన డిమాండ్ను అంగీకరించింది. అంతలోనే రవి మరణ వార్త బయటకు వచ్చింది. రష్యా తన సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను నియమించుకోవడాన్ని నిలిపివేయాలని.. దళంలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించాలని భారతదేశం చేసిన డిమాండ్ను అంగీకరించడానికి రష్యా ఈ నెల ప్రారంభంలో అంగీకరించింది. రష్యన్ సైన్యం నుండి భారతీయ పౌరులందరినీ త్వరగా పంపిస్తామని రష్యా తెలిపింది.