NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

6 నెలల్లో ఎప్పుడైన ఎన్నికలు రావొచ్చన్న బండి సంజయ్‌

6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు లిస్ట్ ను చెక్ చేసుకోండని, ఓట్లను నమోదు చేసుకోవాలని, మన వల్ల ఓట్లను నమోదు చేయించండని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతోనే సాధ్యమన్నారు.

తెలంగాణ స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటినుంచంటే?

జనవరి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి సెలవులు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తారు అన్నట్లు వేచిచూస్తాము. ఆ సమయం రానే వచ్చింది. ఇవాళ తెలంగాణ సర్కార్‌ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు కాగా.. ఇక కాలేజీలకు 3 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అయితే.. ఈనెల జనవరి14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా, జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు. కాగా.. జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని ప్రకటించింది తెలంగాణ సర్కార్‌.

హైదరాబాద్ లో సీబీఐ సోదాలు.. ఆరు చోట్ల అధికారులు తనిఖీలు

హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అధికారులు పలుమార్లు దాడులు చేసిన నేపథ్యంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఐటీ దాడులపై ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పాతబస్తీలోని ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. తాజాగా సదరు ఆటోమొబైల్ కంపెనీ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించి సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ అజంపురాలోని డాక్టర్ అంజుమ్ సుల్తానా ఇంట్లో కూడా సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆమె భర్త ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, లావాదేవీల వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్.. గంటల వ్యవధిలోని ఆరు చోట్ల దోపిడి

సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హడల్ ఎత్తిస్తున్నారు. తెంపుడుగాళ్ళు రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది. గంటల వ్యవధిలో చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఎక్కవగా నార్సింగ్‌ లోనే నమోదు కావడం స్థానికులు గల్లీలో రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ హడలెత్తిస్తున్నాయి. గంటలోనే ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ లలో చైన్‌ స్నాచింగ్‌ జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్‌ చేస్తూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చైన్‌ స్నాచింగ్‌ చేస్తూ కళ్లుమూసి తెరిచేలోగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఆరు చోట్ల స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులకు సవాల్‌ గా మారింది. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో.. స్నాచర్స్ ను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు రంగంలో దిగారు. హైదరాబాదులోని అన్నిచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైకోర్టుకు రైతులు.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు లో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ రామేశ్వర్ పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రైతుల రిట్‌ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ చూస్తే కేవలం తమను ఇబ్బంది పెట్టేందుకే అన్నట్టుగా ఉందని రైతులు వాపోతున్నారు. న్యాయం కోసం అవసరమైతే సుప్రీం కోర్ట్ తలుపు తట్టేందుకైనా సిద్ధమంటున్న రైతులు. హైకోర్టులో న్యాయం జరగపోతే.. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. పంట పొలాలు దూరమైతే మేము రోడ్డున పడాల్సి వస్తుందని, నోటి కాడ కూడును లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు.

నార్సింగి దారి దోపిడీ కేసు.. వెలుగులోకి కరణ్‌సింగ్ ఆగడాలు

నార్సింగి దారి దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానిస్టేబుల్ రాజుపై దాడికి పాల్పడ్డ కరణ్ సింగ్‌పై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి నేరాలకు అలవాటు పడ్డాడు కరణ్ సింగ్. కరణ్ సింగ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైట్నర్ వంటి మత్తుపదార్థాలు తీసుకోవడం, అమ్మాయిలను వేధించడం, దాడిచేసి డబ్బులు, నగలు దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు కరణ్ సింగ్. మైనర్ స్టేజ్ నుంచే కత్తితో దాడి చేయడం, చంపేందుకు కూడా వెనుకాడలేదు.

Read also: CBI Investigations: హైదరాబాద్ లో సీబీఐ సోదాలు.. పాతబస్తీలో ఆరు చోట్ల అధికారులు తనిఖీలు

ఏపీ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ అనుమానాస్పద మృతి.. హోటల్‌ రూమ్‌లో మృతదేహం..

ఆంధ్రప్రదేశ్‌ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ అనుమానాస్పద మృతిచెందారు.. విజయవాడలోని డీవీ మనార్ హోటల్‌లోని రూంలో విగతజీవిగా పడి ఉన్న శివ కుమార్ రాజు ( 74 )ను గుర్తించారు హోటల్ సిబ్బంది.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్‌ గా గుర్తించారు.. అయితే, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు బంధువులు చెబుతున్నారు.. పాత కేసుల ఎవిడెన్స్ కోసం కోర్టుకు హాజరు నిమిత్తం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లిన శివకుమార్ రాజు.. ఈ నెల 5వ తేదీన హోటల్లో రూమ్‌లో దిగారు.. అయితే, ఉదయం నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా, బెల్ కొట్టినా శివకుమార్ రూమ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది.. మారు తాళం పెట్టి గదిలోకి వెళ్లి చూడగా.. నుదిటి మీద గాయంతో విగతజీవిగా పడిఉండడాన్ని గమనించారు.. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మాచవరం పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భక్తులకు టీటీడీ షాక్‌.. భారీగా పెరిగిన వసతి గృహాల అద్దె

భక్తులకు మరో షాక్‌ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వసతి గదుల అద్దెను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచింది.. ఇక, నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3 గదులను రూ. 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1,700 పెంచారు. రెస్ట్‌హౌస్‌ 4లో ఒక్కో గదికి ప్రస్తుతం రూ. 750 వసూలు చేస్తుండగా ఇప్పుడు ఏకంగా 1,700కు వసూలు చేస్తున్నారు.. మరోవైపు, కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ. 2,200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజీల్లో గది అద్దెను రూ. 750 నుంచి 2,800కు పెంచేసింది టీటీడీ.

మేకపాటి కుటుంబంలో కలకలం.. 18 ఏళ్లు రహస్యంగా ఉంచి విడిచిపెట్టారు..!?

మేకపాటి కుటుంబంలో మరో వివాదం కలకం రేపుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి ప్రతినిథ్యం వహిస్తోన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై విడుదల చేసిన ఓ లేఖ సంచలనంగా మారింది.. తమను 18 ఏళ్లు రహస్యంగా ఉంచి విడిచిపెట్టారంటూ శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు.. అయితే, ఆ బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.. లేఖతో పాటు, పాత ఫొటోలు కూడా వైరల్‌గా మారిపోయాయి.. ఇటీవల తనకి కుమారుడే లేడని చంద్రశేఖర్ రెడ్డి చెప్పడంపై తన లేఖ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశాడు శివచరణ్‌రెడ్డి.. మరి నేను ఎవ్వరిని అంటూ లేఖలో ప్రశ్నించాడు.. చదువుకి ఫీజులు చెల్లించడంతో బాధ్యత తీరుతుందా? అంటూ సూటి‌ ప్రశ్నలు సంధించాడు..

Read also: Waltair Veerayya: వీరయ్య వస్తున్నాడు… టైం సెట్ చేసి పెట్టుకోండి

మహిళపై మూత్ర విసర్జన ఘటన.. ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్

విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్‌ మిశ్రా పరారీలో ఉండటం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ముంబై నివాసి శంకర్ మిశ్రాను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

భద్రత అధికారి హత్య కేసు.. ఇద్దరు హిజాబ్‌ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష

హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా అధికారిని చంపినందుకు ఇద్దరు వ్యక్తులను ఉరితీసింది. యువతి కస్టడీలో మరణించడంతో నిరసనలు చెలరేగడంతో పారామిలటరీ దళ సభ్యుడిని చంపినందుకు దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులను ఇరాన్ శనివారం ఉరితీసిందని న్యాయవ్యవస్థ తెలిపింది. దేశవ్యాప్త నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు ఉరితీయబడిన సంఖ్య కంటే తాజా హత్యలు రెట్టింపు అయ్యాయి. డిసెంబర్‌లో ఈ ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష విధించడం ప్రపంచ ఆగ్రహానికి కారణమైంది.

మాట తప్పిన రష్యా.. కాల్పుల విరమణ ప్రకటనకు తూట్లు

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంపై క్షిపణి దాడులకు పాల్పడి విరమణ ప్రకటనకు తూట్లు పొడిచింది. రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ ఏకపక్షంగా 36 గంటల పాటు దాడులను ఆపాలని తన బలగాలను ఆదేశించినప్పటికీ తూర్పు ఉక్రెయిన్‌లోని నగరాలపై రష్యా దాడులకు పాల్పడింది. మాస్కో దళాలు తూర్పున ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం క్రమాటోర్స్క్‌పై కూడా దాడి చేశాయని ఉక్రెయిన్ అధ్యక్ష పరిపాలన డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో తెలిపారు. ఆక్రమణదారులు నగరంపై రెండుసార్లు రాకెట్లతో విరుచుకుపడ్డారని ఆయన చెప్పారు. ఒక నివాస భవనం దెబ్బతిందని.. అందులో బాధితులెవరూ లేరని చెప్పారు.

Read also: Iran: భద్రత అధికారి హత్య కేసు.. ఇద్దరు హిజాబ్‌ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష

వీరయ్య వస్తున్నాడు… టైం సెట్ చేసి పెట్టుకోండి

మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫైనల్ లెగ్ లోకి చేరాయి. జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది, వైజాగ్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు. ఫాన్స్ లో జోష్ పెంచుతూ, వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ కి కిక్ ఇస్తూ ట్రైలర్ ని ప్రీరిలీజ్ ఈవెంట్ కన్నా ముందే రిలీజ్ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈరోజు సాయంత్రం 6:03 నిమిషాలకి వాల్తేరు వీరయ్య ట్రైలర్ బయటకి రాబోతోంది. టైం సెట్ చేసుకోని రెడీగా ఉంటే వీరయ్య ట్రైలర్ తో వచ్చి సోషల్ మీడియాని రఫ్ఫాడించడానికి సిద్ధంగా ఉన్నాడు.

బాలయ్యకు హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కారణం ఇదే..

నందమూరి బాలకృష్ణ ప్రయాణించిన హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ శృతిహాసన్‌ తదితరులు హెలికాప్టర్‌లో బయల్దేరారు.. అయితే, 15 నిమిషాల తర్వాత ఒంగోలులోనే అత్యవసరంగా హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేశారు పైలట్.. దీంతో, బాలయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అందుకే.. హెలికాప్టర్‌ వెనుదిరిగినట్టు వార్తలు వచ్చాయి.. దీనిపై హెలికాప్టర్‌ పైలట్‌ క్లారిటీ ఇచ్చారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పైలట్‌ ఎస్కే జానా.. పొగమంచు కారణంగా హెలికాప్టర్‌ వెనుదిరగాల్సి వచ్చిందన్నారు.. హైదరాబాద్ కు ప్రయాణించే మార్గం క్లియరెన్స్ లేకపోవటం వల్ల వెనుతిరిగామన్నారు. ప్రస్తుతం ఏటీసీ నుండి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు.. అయితే, హెలికాప్టర్‌లో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదని క్లారిటీ ఇచ్చారు.. కేవలం వెదర్ కండిషన్ బాగాలేకపోవటం వళ్లే వెనక్కు వచ్చామన్నారు. ఏటీసీ నుండి క్లియరెన్స్ రాగానే బయల్దేరనున్నట్టు వెల్లడించారు పైలట్ ఎస్కే జానా..
Sankranti Holidays: తెలంగాణ స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటినుంచంటే?