స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రకు అందరూ సహకారం అందించాలి..
స్వచ్చ ఆంధ్ర స్వర్ణాంధ్ర కోసం అందరూ సహకారం అందించాలని మంత్రి నారాయణ కోరారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.. కానీ, మన రాష్ట్రంలో చంద్రబాబు స్వచ్ఛంద కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.. ప్రతి నెలా మూడో శనివారం ఒక నినాదంతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీటి కోసం 5 వేల 350 కోట్ల నిధులను తీసుకు వస్తే.. గత ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఆ నిధులను తీసుకువస్తున్నాం.. అమృత్ పథకం కింద కూడా నిధులను తెస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ చెప్పుకొచ్చారు. ఇక, వైసీపీ హయాంలో చెత్త పైన పన్ను వేసింది అని మంత్రి నారాయణ ఆరోపించింది. అది చెత్త ప్రభుత్వం.. అభివృద్ధిని నాశనం చేసింది అని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది అన్నారు. ఎలక్ట్రానిక్ వేస్టును పర్యావరణహితంగా నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేపట్టాం.. రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను గత ప్రభుత్వం వదిలేసి పోయింది.. వచ్చే అక్టోబర్ 2వ తేదీలోగా రాష్ట్రంలో చెత్త నిల్వలు లేకుండా చేస్తామని నారాయణ వెల్లడించారు.
ఉత్కంఠ రేపుతున్న వైజాగ్ మేయర్ అవిశ్వాసం.. మేజిక్ ఫిగర్ పై కొనసాగుతున్న ఊగిసలాట..
రాష్ట్రంలో వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మేజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేయగా ముగ్గురు జనసేనాలో చేరిపోయారు. మాజీమంత్రి అవంతి కుమార్తె ప్రియాంక సైతం కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చేరికలు అన్నీ తమకు ప్లస్ అని భావిస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలో మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగొచ్చారు. వారిని రాత్రి వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు తరలించారు. ఓటింగ్ సమయంలో కార్పొరేటర్లు నేరుగా ఆఫీసుకు రానున్నారు. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది. ఫ్యాన్ సింబల్ పై గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కలియుగ వైకుంఠం కిక్కిరిసిపోయింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి24 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 58, 519 మంది భక్తులు దర్శించుకోగా.. 30, 360 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. 3.27 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. అయితే, ఇవాళ ఆన్ లైన్లో జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు జరగనుంది.
గాలులు బీభత్సం.. బిల్డింగ్ పై నుంచి కూలీన భారీ క్రేన్.. పలు వాహనాలు ధ్వంసం
హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. బలమైన ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్పిటల్ 4వ అంతస్తుపై పడ్డ క్రేన్.. గతంలోనే భవనం కాలి చేసేసిన ఆరోగ్య హాస్పిటల్ మేనేజ్మెంట్.. 4వ అంతస్తు కాలీగా ఉండడం అందులో పేషెంట్ లు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. క్రేన్ పడడంతో 4వ అంతస్తు పాక్షికంగా ధ్వంసమైంది. గోడలు & సైడ్ వాల్ పెచ్చులూడి కింద షెడ్ పై పడటంతో కైలాష్ డయాగ్నస్టిక్ సెంటర్ ఫర్నిచర్ ధ్వంసమైంది. నార్త్స్టార్ నిర్మాణానికి చెందిన భారీ క్రేన్ కూలడంతో క్రేన్ తొలగిస్తున్న టెక్నికల్ టీం.. భారీ క్రేన్ కూలిపోవడంతో హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయంతో క్రేన్ తొలగింపు పనులు ముమ్మరం చేశారు అధికారులు.. నిన్న రాత్రి నుంచి క్రేన్ తొలగింపు పనులు జరుగుతున్నాయి.
ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కూలిపోయిన భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగిందని అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ ‘రామాయణ’ పార్ట్ 2 అప్డేట్ !
తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఇప్పటికే చాలా సార్లు రామాయణం ఇతిహాసాలు సినిమా రూపంలో, సీరియల్ రూపంలో చిన్ననాటి నుండి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రామాయణం కొత్త తరం వారికి కొత్తగా చూపించాలి అనే ఉద్దేశంతో రకరకాల తెరకెక్కిస్తునే ఉన్నారు. దీంతో చిన్న నుంచి పెద్ద వరకు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రామాయణం ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో హిట్ దక్కలేదు.. అందులోను రామాయణంను వక్రీకరించినట్లుగా కొందరు విమర్శించారు. కాగా ఇప్పుడు మరోసారి రామాయణం పట్టాలెక్కుతోంది. ఈసారి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా బాలీవుడ్ లో ‘రామాయణం’ రాబోతుంది. స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ లేటెస్ట్ మూవీలో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తుండగా.. రావణుడి పాత్రను యశ్ పోషిస్తున్నారు. సూర్పనక గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. బాబీ దేఓల్ కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా తొలి భాగం శరవేగంగా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, తాజాగా ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మే నెల ఆఖరి నుంచి ‘రామాయణ పార్ట్ 2’ చిత్రీకరణ మొదలు కానున్నట్లు సమాచారం.
వీర ధీర శూరన్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!
తమిళ స్టార్ చియన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’. పార్ట్-2’గా రూపొందిన ఈ సినిమాకు ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్పై రియా శిబు నిర్మించింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ తమిళంలో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి, తెలుగులో మాత్రం అంతగా రాణించలేకపోయింది. అందులోను ఈ చిత్రం విడుదల రోజే ఓటీటీ హక్కులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. లీగల్ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా మల్టీ ప్లెక్సుల్లో ఫస్ట్ షోలు రద్దయ్యాయి. దీంతో సదరు థియేటర్ల యాజమాన్యం ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి పంపిస్తామంటూ సందేశాలు పంపించారు. ఆ తర్వాత నిర్మాతలు సమస్యను పరిష్కరించడంతో యదావిధిగా థియేటర్స్లో సినిమా స్క్రీనింగ్ జరిగింది. విక్రమ్కి జోడిగా దుషారా విజయన్ హీరోయిన్గా నటించగా, తమిళ స్టార్ ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడి, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇక తాజాగా ఈ చిత్రం థియేటర్లలో విడుదలై నాలుగు వారాల్లోనే ఓటీటీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ‘వీర ధీర శూర’ పార్ట్-2 ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ‘ఒక రాత్రి నియమాలు లేవు. మనుగడ మాత్రమే. ప్రతిదీ మార్చే రాత్రి’ అని పేర్కొంది.
నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ పోరు.. పిచ్ రిపోర్ట్ ఇదే
IPL-2025లో మొదటి సూపర్ ఓవర్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ నేడు లక్నో సూపర్జెయింట్స్తో తలపడనున్నది. రాజస్థాన్ ఈ మ్యాచ్ను తన సొంత మైదానం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ కు ముఖ్యం. లేకుంటే ప్లేఆఫ్స్ రేసు చాలా కష్టమవుతుంది. ఏడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఐదు ఓటములతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం పిచ్ను పరిశీలిస్తే.. బ్యాట్స్మెన్లకు అలాగే బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈ పిచ్ స్లోగా ఉంటుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. కానీ బ్యాట్స్మన్ ఇక్కడ కొంత సమయం గడిపితే, సులభంగా పరుగులు సాధించొచ్చు. ఏదేమైనా, బ్యాట్స్మెన్పై బౌలర్లకు స్వల్ప ఆధిక్యం ఉంటుంది. తొలి ఓవర్లలో బంతి బ్యాట్పైకి చక్కగా వస్తుంది, కానీ తర్వాత పిచ్ నెమ్మదిస్తుంది. ఈ సీజన్లో రాజస్థాన్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఒకే ఒక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఆర్సిబి 175 పరుగులు చేసి వారిని ఓడించింది.