NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

3 రోజులు బ్రేక్‌.. నేటి నుంచి గోదావరిలో గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి
ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నది పోటెత్తింది.. దీంతో గోదావరి నదిలో గణేష్‌ నిమజ్జనాలు నిలిపివేసిన విషయం విదితమే.. రాజమండ్రి వద్దర గోదావరి నదిలో మూడు రోజుల పాటు గణేష్‌ నిమజ్జనాలు నిలిచిపోగా.. నేటి నుండి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు అధికారులు.. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రాజమండ్రిలో మూడు రోజులుగా గణేష్ నిమజ్జనాలు నిలిచిపోయాయి. ఇక, గోదావరిలో వరద ఉధృతి తగ్గడంతో.. గణేష్ నిమజ్జనాలు కోసం పుష్కర్ ఘాట్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ర్యాంపులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోటుకు పంటు కట్టి దానిపై గణేష్ విగ్రహాలు క్రేన్ లో ద్వారా ఎక్కించి గోదావరి మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిమజ్జనం విధులకు హాజరు అవుతున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది 2400 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు గోదావరిలో 150 గణేష్ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేశారు. మరోవైపు రేపటి నుండి మూడు రోజుల పాటు భారీగా ఊరేగింపులతో నిమజ్జనానికి గణనాథులు విగ్రహాలు తరలి రానున్నాయి. నిమజ్జనానికి విగ్రహంతోపాటు. ఒక్కరికీ మాత్రమే రేవులోకి అనుమతి ఇస్తున్నారు. గోదావరిలో నిమజ్జనానికి ఊరేగింపులతో వచ్చే వారు మద్యం సేవించి రావద్దని, బాణసంచా కాల్పులు చేయవద్దని. రేవులో వద్ద ఫ్లేక్స్ తో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు పోలీసులు..

విధి నిర్వహణలో కానిస్టేబుల్‌ మృతి.. అండగా ఉంటామని హోంమంత్రి హామీ
విధి నిర్వహణలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సీఎం చంద్రబాబు నాయుడు బందోబస్తు విధులకోసం వచ్చిన.. ఏఆర్ కానిస్టేబుల్ చంద్రా నాయక్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. సహచరులు ఎంతో శ్రమించి సీపీఆర్ చేసి కాపాడాలని ప్రయత్నించినా ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ (పీసీ 3570) అకాలమరణం చెందడం అత్యంత విషాదకరం అన్నారు.. చంద్రానాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు హోం మంత్రి అనిత… ఈ ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే ఆంధ్రా హాస్పిటల్ కి వెళ్లి కానిస్టేబుల్ చంద్రా నాయక్ పార్థివదేహానికి నివాళులర్పించిన హోంమంత్రి.. అనంతపురం జిల్లాకు చెందిన చంద్రనాయక్ కుటంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్ సహా పలువరు మృతి చెందడం శోచనీయమన్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు హోం మంత్రి వంగలపూడి అనిత..

శ్రీశైలం మల్లన్న అరుదైన రికార్డు.. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం.. అలానే ఆలయంలోని నంది విగ్రహానికి.. ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం లభించింది.. ముఖ్యంగా పురాతన పరంగా.. ఆధ్యాత్మికంగా.. సాంస్కృతి, సంప్రదాయాలు.. ఆధ్యాత్మిక సత్యం యొక్క అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపంగా.. పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో శ్రీశైల ఆలయం చేరింది.. దీనితో శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీకరణ పత్రం వరించింది.. ఈ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రెటరీ ఉల్లాజీ ఎలియజర్ అందజేశారు.. ధ్రువీకరణ పత్రం అందజేతలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం భూమండలానికి నాభిస్తానని శ్రీశైల పుట్టడం పైగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడం ఎంతు అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.. శ్రీశైల ఆలయానికి లండన్ వారిచే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు ధ్రువీకరణ పత్రం రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.. అయితే గతంలోనూ దేవస్థానంలో 7 విభాగాలకు ఐ.ఎస్.ఓ ద్వారా ధ్రువీకరణ పత్రలను అందుకుంది శ్రీశైలం మల్లన్న ఆలయం.. ఇప్పుడు శ్రీశైలం సిగలో మరో మణిహారం చేరినట్టు అయ్యింది..

నేడు కరీంనగర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
నేడు కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో పాటు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యే విజయరమణ రావు పాల్గొననున్నారు. ఇక శుక్రవారం హైదరాబాద్ లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతుల వ్యవసాయ పంపుసెట్లను ఎంపిక చేసి సోలార్ పవర్ ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ప్రభుత్వ ఖర్చుతో పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయాలని అధికారులకు భట్టి ఆదేశాలు జారీ చేశారు.

నేడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
ఈరోజు (శనివారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే ఛాన్స్ కూడా ఉంది. గత 45 ఏళ్లలో జమ్మూలోని దోడాలో ఓ ప్రధాని బహిరంగ సభ పెట్టడం ఇదే తొలిసారి. ఒకప్పుడు ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న దోడా జిల్లాను ఇప్పుడు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దోడ జిల్లాలో రెండు గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దోడాతో పాటు చుట్టుపక్కల ఎనిమిది స్థానాలను గెలుచుకోవడానికి బీజేపీ తన వ్యూహాలు రచిస్తుంది. జమ్మూ కశ్మీర్ లోని మొత్తం 90 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. సెప్టెంబరు 18వ తేదీన తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. అక్టోబరు 4వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ముంబై లోకల్ రైలులో ప్రయాణించి, రైల్వే ఉద్యోగులతో సెల్ఫీ దిగిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం లక్షలాది మంది ముంబయి వాసులకు జీవనాడి అయిన లోకల్ రైలులో ప్రయాణించారు. ఈ పర్యటనలో ఆయన ప్రయాణికులతో కూడా మాట్లాడుతూ కనిపించారు. రైల్వే మంత్రి దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో సబర్బన్ రైలు ఎక్కి 27 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత భాండప్ స్టేషన్‌లో దిగారు. ఓ అవార్డుల వేడుక కోసం ముంబై వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వైష్ణవ్ అంబర్‌నాథ్ వెళ్లే స్లో లోకల్ ట్రైన్‌లోని సెకండ్ క్లాస్ కోచ్‌లో ఎక్కి భాండూప్ స్టేషన్‌లో దిగాడు. మంత్రితో సంభాషణ సందర్భంగా.. ప్రయాణీకులు సర్వీసుల సంఖ్యను పెంచాలని కోరారు. రైలు సర్వీసులో తరచుగా అంతరాయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రైలులో కేంద్ర మంత్రి వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ.16,240 కోట్లతో 12 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో నెట్‌వర్క్‌లోని ట్రాక్‌ల పొడవు 301 కిలోమీటర్లు పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇది ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టులలో CSMT-కుర్లా మధ్య 5వ , 6వ లైన్, ముంబై సెంట్రల్-బోరివలి మధ్య 6వ లైన్, కళ్యాణ్-అసంగావ్ మధ్య 4వ లైన్, కళ్యాణ్-బద్లాపూర్ మధ్య 3వ , 4వ లైను, నీలాజే-కోపర్ డబుల్ తీగ లైన్, నైగావ్-జుయిచంద్ర లైన్ పనులు సాగుతున్నాయన్నారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2024.. నేడు పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్! రికార్డ్స్ ఇవే
2024 ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై 3-1 తేడాతో నెగ్గిన భారత్.. ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. నేడు కీలక సమరానికి సిద్దమైంది. చివరి రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. సోనీ స్పోర్ట్స్ టెన్ 1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1 హెచ్‌డి ఛానెల్‌లలో ఈ మ్యాచ్ ప్రసారం చేయబడుతుంది. మ్యాచ్‌ను సోనీలివ్ యాప్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీలో పాకిస్థాన్‌ కూడా మంచి ఫామ్ మీదుంది. జపాన్, చైనాపై విజయాలు సాధించిన పాక్.. మలేసియా, కొరియాపై డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 2013 నుంచి పాకిస్థాన్‌తో ఆడిన 25 మ్యాచ్‌ల్లో భారత్‌ ఏకంగా 16 మ్యాచ్‌లు గెలిచింది. పాక్ కేవలం 5 విజయాలు మాత్రమే సాధించగా.. 4 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. చివరగా గతేడాది ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌ను 10-2తో భారత్ చిత్తుచేసింది. ఇప్పుడు రెండు టీమ్స్ ఫామ్‌లో ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌ జట్టు కఠినమైందని, ఏ దశలోనైనా పుంజుకోగలదని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. ప్రపంచ హాకీలో దాయాది జట్ల మధ్య పోరుకు మరేదీ సాటిరాదన్నాడు.

కార్తీ – అరవింద్ స్వామిల ‘సత్యం సుందరం’ టీజర్ వచ్చేసింది..
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్’ సత్యం సుందరం’.  విజయ్ సేతుపతి, త్రిష నటించిన ’96’ మూవీ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ టీజర్ కార్తీ, అరవింద్ స్వామి రెండు వరల్డ్స్ ని ప్రజెంట్ చేసింది, వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని హైలైట్ గా వుంది. వీరిద్దరు డిఫరెంట్ లైఫ్ స్టయిల్ లో ఆకట్టుకున్నారు. కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే, అరవింద్ స్వామి రిజర్వ్‌డ్, అర్బన్ పర్సనాలిటీ గా కనిపించారు. 96లో డ్రామాని డీల్ చేయడంలో తన సత్తా చాటిన సి ప్రేమ్ కుమార్ లీడ్ రోల్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. కార్తీ, అరవింద్ స్వామి డిఫరెంట్ రోల్స్ లో మ్యాజిక్ క్రియేట్ చేసారు. ఈ టీజర్ గ్రేట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేంద్రన్ జయరాజు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది, గోవింద్ వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. ఈ చిత్రానికి ఆర్‌ గోవింద్‌రాజ్‌ ఎడిటర్. సత్యం సుందరం హ్యుమరస్ అండ్ హార్ట్ వార్మింగ్ మూవీని టీజర్ ప్రామిస్ చేస్తోంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘సత్యం సుందరం’  సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

ఇప్పటివరకు ఓవర్సీస్ లో దేవర క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే..
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నపాన్ ఇండియా చిత్రం దేవర. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవరతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ చిత్రంలోని ‘ఆయుధ పూజ’ అంటూ సాగే నాలుగవ లిరికల్ సాంగ్ ను వచ్చే వారం విడుదల చేయనున్నారు మేకర్స్. దేవర ఒవర్సీస్ ప్రీ సేల్స్ లో దేవర సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ ను బద్దలు కొడుతోంది. ఓవర్సీస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంది. ఇందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది దేవర. ఓవర్సీస్ లో దేవర ఇప్పటివరకు క్రియేట్ చేసిన రికార్డులు గమనిస్తే USA – అత్యంత వేగంగా 15వేలు, 20వేలు, 30వేలు, 35వేలు, టిక్కెట్లు విక్రయింబడిన సినిమాగా దేవర నిలిచింది. అలాగే ఫాస్టెస్ట్ $1M & $1.5M ప్రీ సేల్స్ రాబట్టిన మూవీగా సెన్సషనల్ రికార్డు తన పేరిట నమోదు చేసాడు దేవర. అటు UK లో లిమిటెడ్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అత్యంత ఫాస్ట్ గా 10k టిక్కెట్లు బుక్ అయిన సినిమాగా దేవర రికార్డు క్రియే చేసింది.  సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ విడుదల చేస్తున్నాడు.