NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఖమ్మం సభా వేదికపై వారు మాత్రమే ఉంటారు..
దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభగా ఖమ్మం సభ నిలిచిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈనెల 18న ఖమ్మం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో కేసీఆర్ కరీంనగర్ లో సింహగర్జన నిర్వహించారని, బీఆర్ ఎస్ తొలి సభను ఖమ్మంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఖమ్మం సభలో పలు జాతీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఖమ్మం ప్రజల పోరాటం, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న తీరు మరువలేనిదన్నారు. వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని నిర్మించారని పేర్కొన్నారు. 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశామని, 20 పార్కింగ్ స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు. సభలో వేలాది మంది వలంటీర్లు పాల్గొంటారని, ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తామన్నారు. ఎక్కువగా 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ నిర్వహిస్తామని చెప్పారు. మహబూబాబాద్, సూర్యాపేట నుంచి ఎక్కువ మంది జనం వస్తున్నారు. ఖమ్మం చరిత్రలో పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, కేసీఆర్‌ను ఆశీర్వదించేందుకు సభకు తరలిరావాలని తహతహలాడుతున్నారన్నారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో ప్రజలను తరలించడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఖమ్మం సభకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుందని, డయాస్ ఎదుట ముఖ్య నేతలకు ప్రత్యేక సెక్టార్ కేటాయించామని అన్నారు.

వెంకటాపురం ఘటనలో ట్విస్ట్.. ఇన్సూరెన్స్ డబ్బులకోసం సెక్రటేరియట్ ఉద్యోగి డ్రామా
ఉమ్మడి మెదక్ జిల్లా వెంకటాపూర్ వద్ద జరిగిన కారు చోరీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. కారు చోరీ కేసులో మృతుడు సచివాలయ ఉద్యోగి ధర్మ కాదని పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ధర్మను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ సమీపంలో కారులో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో దిమ్మతిరికే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచివాలయ ఉద్యోగి ధర్మానాయక్ ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ లో రూ. 2 కోట్లు అప్పులు చేశాడు. ధర్మాకు రెండుకోట్ల అప్పులు ఎలా తీర్చాలని భయం పట్టుకుంది. చివరికి ఓ.. ఐడియా మైండ్‌ లో మొదలైంది. చనిపోయినట్లు నటిస్తే రూ. బీమా సొమ్ము రూ.7 కోట్లు అవుతుంది. దీంతో అప్పులు తీర్చవచ్చని ధర్మానాయక్ భావించాడు. ఈ నెల 9న కారు చోరీ కేసులో ధర్మానాయక్ మృతి చెందినట్లుగా డ్రామా ఆడారు. ఈ నెల 5న హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు. కుటుంబ సభ్యులను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. పనికి వెళుతున్నానని చెప్పిన ధర్మానాయక్ ఇంట్లో కాలిపోయిన స్థితిలో కనిపించాడు. ఉమ్మడి మెదక్ జిల్లా భీమ్‌లతండాకు చెందిన ధర్మానాయక్ కారు చోరీ కేసును పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. పెట్రోల్ బాటిల్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

పీఎస్‌లో అనుమానాస్పద మృతి.. సీఐ సహా నలుగురు పోలీసులపై వేటు
అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఓ దొంగ అనుమానాస్పద మృతి కేసు పోలీసులపై వేటు పడేలా చేసింది.. ఈ ఘటనపై కల్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయదుర్గంలో గొర్రెల దొంగతనం జరగడంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని సోమవారం తమకు అప్పగించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు రిమాండ్​కు పంపవలసి ఉంది. రామాంజనేయులు అలియాస్ అంజి, శ్రీనివాసులు ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినారు. రామాంజనేయులపై దాదాపు 15 గొర్రెల దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు.. అయితే.. రామాంజనేయుులు అతని లుంగీతో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఉండటంతో అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై అసుపత్రికి తీసుకెళ్లారు… కానీ, అప్పటికే చనిపోయాడని.. దీనిపై కేసు నమోదు చేశాం.. కొందరు డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. కాబట్టి ఉన్నతాధికారులు వారిని సస్పెండ్‌ చేశారు.. ఈ ఘటనలో సీఐ శ్రీనివాసులు, హోంగార్డు రమేష్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు మధుబాబు, గంగన్నలను సస్పెండ్‌ చేశారు.

విశాఖలో పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు..
విశాఖపట్నం జిల్లాలో ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది.. అయితే, డ్రైవర్‌ అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది.. ఇవాళ ఉదయం అనంతగిరి మండలం కాశీపట్నం దగ్గర విశాఖ – విశాఖ – కిరండోల్ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది ఓ బోగీ.. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, కుటుంబసభ్యులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.. అయితే, ఘటనా స్థలంలో రైళ్ల పునరుద్దరణకు ఏర్పాట్లు ప్రారంభంఅయ్యాయి.. అయితే, కొండ ప్రాంతాల్లో అతి శీతల ఉష్ణోగ్రతల సమయాల్లో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు రైల్వే అధికారులు.. ఓవైపు పండుగ, మరోవైపు.. ఈ సీజన్‌లో విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆందోళనకు గురయ్యారు. కానీ, ఎలాంటి నష్టం జరగకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు..

చిచ్చుపెట్టిన చికెన్‌..! రెండు వర్గాల మధ్య దాడులు
చికెన్‌ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.. పరస్పరం దాడులకు వరకు వెళ్లింది వ్యవహారం.. ఇంతకీ చికెన్‌ ఏంటి? రెండు వర్గాల మధ్య దాడులకు ఎందుకు దారితీసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది… సోమవారం రాత్రి అలీగఢ్​లోని సరాయ్​ సుల్తానీలో ఉన్న ఓ మాంసం దుకాణానికి కొందరు యువకులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెళ్లారు.. అయితే, ఆ సమయంలో చికెన్‌ విక్రయించే వ్యక్తి, ఆ యువకులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అది కాస్త గొడవకు దారితీసింది.. దీంతో, పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సాస్నిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరాయ్ సుల్తానీ చౌకీ సమీపంలోని జరిగిన రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణలో.. ఆకాష్, సిద్ధార్థ్, నరేష్ గౌతమ్ అనే ముగ్గురు యువకులు గాయపడ్డారు. కొన్ని కార్ల అద్దాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన యువకులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఏపీ హక్కుల కోసం కేసీఆర్‌ కృషి..! ఆయన ఆంధ్ర పాలకులు, దోపిడీనే ప్రశ్నించారు..
కేసీఆర్‌ జాతీయ పార్టీ నేతగా ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం కృషి చేస్తారని తెలిపారు బీఆర్ఎస్‌ నేత పార్థసారథి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ ఎప్పుడైనా ఆంధ్ర పాలకులు, పెట్టుబడిదారుల దోపిడీనే ప్రశ్నించారు.. కానీ, ప్రజలను ఆయన ఎప్పుడూ దూషించలేదని స్పష్టం చేశారు.. ఇక, కేసీఆర్ సీఎం అయ్యాక.. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని తెలిపారు. విభజన హామీలు అమలు‌ చేయకుండా బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని విమర్శించారు.. కేసీఆర్‌ జాతీయ పార్టీ నేతగా ఏపీ హక్కుల కోసం పోరాటం చేస్తారని తెలిపారు.. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్‌ బహిరంగ సభ దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతం అవుతుందని ప్రకటించారు.. బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందన్న ఆయన.. తెలంగాణలో‌ జరిగిన అభివృద్ధి ఫలాలను దేశం మొత్తం అమలు చేయాలని కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారని చెప్పుకొచ్చారు. రైతే రాజు అనే నినాదంతో మేం ప్రజల్లోకి వెళ్తాం.. దళిత బంధు పథకాన్ని దేశం అంతా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారని తెలిపారు పార్థసారథి.. తెలంగాణలో‌ జరుగుతున్న అభివృద్ధిని ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని.. చంద్రబాబు, వైఎస్‌ జగన్ రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.. ఇ, వైఎస్‌ జగన్-చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే భయం.. అందుకే ప్రశ్నించడం మానేశారు విమర్శించారు. కేసీఆర్ సారథ్యంలో ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ఫ్లాంటును ప్రైవేటు పరం చేస్తే అడగలేక పోయారు అని ఏపీ నేతలపై మండిపడ్డారు.. కానీ, కేసీఆర్, కేటీఆర్.. విశాఖ‌ కార్మికులకు అండగా నిలిచారన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల‌పై జగన్, చంద్రబాబు పోరాటం చేయలేని పరిస్థితి ఉందని ఆరోపించారు.. మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఉంది.. ఏపీలోనే వారికి అవకాశాలు కల్పించే సత్తా మాత్రం కేసీఆర్‌కే ఉందన్నారు.

రాహుల్‌ను హగ్ చేసుకునేందుకు పరిగెత్తుకొచ్చిన యువకుడు.. వీడియో వైరల్
భారత్ జోడో యాత్ర సందర్భంగా మంగళవారం ఓ వ్యక్తి రాహుల్ గాంధీ భద్రతను ఉల్లంఘించడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ భారత్ జోడో యాత్రలో ఓ వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హగ్‌ చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో పసుపు రంగు జాకెట్ ధరించిన వ్యక్తి రాహుల్ గాంధీ వైపు వచ్చి కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. రాహుల్‌ పక్కన నిలబడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను తోసేశారు. రాహుల్ గాంధీకి జెడ్-ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. అంతర్గత భద్రతా వలయాన్ని ఛేదిస్తూ ఓ వ్యక్తి రాహుల్ వద్దకు రావడం కలకలం రేపిందిరాహుల్ గాంధీ జెడ్-ప్లస్ కేటగిరీ భద్రత, అంతర్గత వలయాన్ని అందించే పనిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారత్ జోడో యాత్రలో పెద్ద లోపాలకు కారణమైందని కాంగ్రెస్ ఆరోపించింది. మంగళవారం ఉదయం హోషియార్‌పూర్‌లోని తండాలో భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ చౌదరి, రాజ్ కుమార్ చబ్బేవాల్‌లు రాహుల్ గాంధీతో పాటుగా యాత్రలో పాల్గొన్నారు.తన యాత్రకు విశేష స్పందన లభిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలపై కూడా ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రయాణంలో చాలా వరకు తెల్లటి టీ-షర్టును మళ్లీ ధరించి కనిపించిన రాహుల్ గాంధీ, దారిలో చాలా మంది వ్యక్తులతో సంభాషించి, వారితో ఫోటోలు దిగారు.

కరాచీలో దావూద్‌ ఇబ్రహీం మళ్లీ పెళ్లి చేసుకున్నాడట..!
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఈసారి పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. సెప్టెంబర్ 2022లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ముందు హసీనా పార్కర్ (దావూద్ సోదరి) కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించాడు. హసీనా పార్కర్ కుమారుడు అలీ షా వాంగ్మూలం ప్రకారం.. అండర్ వరల్డ్ డాన్ తన మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదు. దావూద్ ఇబ్రహీం ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించి దర్యాప్తు సంస్థ పలు ప్రాంతాల్లో దాడులు చేసి అనేక మందిని అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏజెన్సీ కోర్టులో ఛార్జిషీట్‌ను కూడా సమర్పించింది. దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్య మెహజబీన్ షేక్‌కు ఇంకా విడాకులు ఇవ్వలేదని అలీ షా ఎన్‌ఐఏకు తెలిపాడు. షా ప్రకారం, దావూద్ రెండో వివాహం మెహజబీన్ నుంచి దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చు. 2022 జూలైలో తాను దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్‌లో కలిశానని, దావూద్ రెండో మహిళతో దావూద్ వివాహం గురించి ఆమె తనకు చెప్పిందని అలీ షా చెప్పారు. మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా భారతదేశంలోని దావూద్ బంధువులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అతను పేర్కొన్నాడు. హసీనా పార్కర్ కుమారుడు అలీ షా కూడా దావూద్ ఇబ్రహీం ఆచూకీ గురించి ఎన్‌ఐఏకు చెప్పాడు. అండర్ వరల్డ్ డాన్ ఇప్పుడు కరాచీలో ఉన్నట్లు అలీ షా వెల్లడించాడు.

భారత్‌ నుంచి కొవిడ్‌ పరార్‌.. కనిష్ఠానికి రోజువారీ కొత్త కేసులు
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళ దేశంలో అత్యల్ప రోజువారీ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కొవిడ్ తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఇండియాలో కొత్తగా 89 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య కొవిడ్ ప్రారంభమైన మార్చి 27, 2020 నుంచి నేటి వరకు అత్యల్ప కొవిడ్ కేసుల సంఖ్య అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే క్రియాశీల కేసులు 2,035కి తగ్గాయి. ఇప్పటివరకు మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లు (4,46,81,233) కాగా.. మరణాల సంఖ్య 5,30,726గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.05 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.09 శాతంగా నిర్ణయించబడింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.01గా నమోదైంది. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,48,472కి పెరిగింది, అయితే మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.17 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. భారత్‌లో వ్యాక్సినేషన్‌ల సంఖ్య ఆగస్టు 7, 2020న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటింది. గత ఏడాది జనవరి 25న దేశం నాలుగు కోట్ల మైలురాయిని దాటింది.

సినిమా ప్రేమికులకి గుడ్ న్యూస్, ఆ రోజు 99/-కే సినిమా…
థియేటర్స్ లో సినిమాకి వెళ్లాలి అంటే మినిమమ్ 250 పెట్టి టికెట్ కొనాలి, టాక్స్ ఎక్స్ట్రా. ఇంటర్వెల్ లో మన ఫుడ్ కి అయ్యే కర్చు కూడా కలిపితే ఒక ప్రేక్షకుడు మంచి థియేటర్ లో సినిమాకి వెళ్లాలి అంటే ఆల్మోస్ట్ 400 వదిలించుకోవాల్సిందే. అదే ఇక ఫ్యామిలీతో వెళ్లాలి అంటే లీస్ట్ కేస్ లో 2500 గోవింద. అందుకే థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ నెమ్మదిగా తగ్గిపోతున్నారు. టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే సినిమాలు చూడట్లేదు అనుకునే వాళ్లకి PVR థియేటర్స్ చైన్ ఒక స్పెషల్ గిఫ్ట్ ని ఇస్తోంది. జనవరి 20న మాత్రమే, కేవలం ఒక్క రోజు పాటే 99/- రూపాయలకే సినిమా చూపిస్తాం అంటూ అనౌన్స్ చేశారు. సినిమా లవర్స్ డే సంధర్భంగా జనవరి 20న 99/- సినిమాలు చూపించబోతున్నారు. చండీఘర్, పాండిచెర్రి, పటాన్ కోట్ ప్రాంతాల్లో ఈ ఆఫర్ వర్తించదు. అన్ని సౌత్ రాష్ట్రాల్లో 110+GST తో ఈ ఆఫర్ వర్తిస్తుంది, తెలంగాణాలో మాత్రం 112+GST. రిక్లైనర్స్, IMAX, 4D స్క్రీన్స్ లో ఈ PVR ఆఫర్ వర్తించదు. సో దగ్గరలోని ఏదైనా PVRతో లింక్ అయిన ఒక మంచి మల్టీప్లెక్స్ థియేటర్ చూసుకోని… ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు, తెగింపు సినిమాలని బ్యాక్ టు బ్యాక్ బింగే వాచ్ చేసెయ్యండి. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తో, లవర్ ఉంటే లవర్ తో ఒక మూవీ డేట్ చేసేయండి.