NTV Telugu Site icon

నాన్నపై ‘మీ టూ’ ఆరోపణలు! స్పందించిన డైరెక్టర్స్ డాటర్…

‘మీ టూ’… ఆ మధ్య విపరీతంగా వార్తల్లో నిలిచిన ఈ ఉద్యమం తరువాత చల్లబడింది. కానీ, అంతలోనే చాలా మంది ఇబ్బంది కూడా పడాల్సి వచ్చింది. ‘మీ టూ’ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఎవరు నిజంగా నేరం చేశారో, ఎవరి మీద దుష్ప్రచారం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అలా క్రాస్ ఫైర్ లో చిక్కుకుని న్యూస్ లో నిలిచిన ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్!

2020లో అనురాగ్ పై ‘మీ టూ’ ఆరోపణలు చేసింది ఓ నటి. ఆశ్చర్యకరంగా బాలీవుడ్ లో చాలా మంది ఆ అమ్మాయికి కాకుండా కశ్యప్ కే సపోర్ట్ చేశారు! మిగతా సందర్భాల్లో ఇతర మేల్ సెలబ్రిటీలపై ‘మీ టూ’ ఆరోపణలొస్తే అంతెత్తున లేచిన వారు కూడా అనురాగ్ విషయంలో భిన్నంగా వ్యవహరించారు. సక్సెస్ ఫుల్ చిత్రాలు తీస్తూ మంచి క్రేజ్ లో కొనసాగుతోన్న టాలెంటెడ్ డైరెక్టర్ పై ఇండస్ట్రీలోని వారికి నమ్మకం ఉండటం… సహజమే కదా! మొత్తానికి చాలా మందే అనురాగ్ కి నైతిక మద్దతు తెలిపారు. ఇతర మీ టూ ఆరోపణలన్నిటిలాగే ఈ కేసు కూడా ఎటూ తేలకుండానే ప్రవాహంలో కొట్టుకుపోయింది.

అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురు ఆలియా కశ్యప్ తన తండ్రి పై వచ్చిన ‘మీ టూ’ ఆరోపణల గురించి తాజాగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమెని ప్రశ్నించగా… “ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యా”నని ఆలియా చెప్పింది. తన తండ్రిని ద్వేషించే వారి గురించి పెద్దగా పట్టించుకోలేదని వివరించిన ఆమె… అనురాగ్ కశ్యప్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తియటం బాధించిందని వాపోయింది. అయితే, అప్పట్లో అనురాగ్ తన చుట్టూ ముసురుకున్న వివాదాల ప్రభావం సాధ్యమైనంత వరకూ ఆలియా పై పడకుండానే చూసుకున్నాడట!

‘మీ టూ’ ఆరోపణలు వచ్చిన సమయంలో అనురాగ్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూడా ఆయనకే మద్దతు పలికింది. తన సొషల్ మీడియా పోస్టులో… ఆరోపణలన్నీ ‘కుట్రపూరితం’ అంటూ కొట్టిపారేసింది. “వాళ్ల స్థాయి అంతే… నువ్వు నీలాగే ముందుకు సాగిపో” అంటూ మాజీ భర్తకు నైతిక స్థైర్యం అందించింది!