తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా తెలంగాణ వైయస్సార్ అభిమానులకు వైఎస్ షర్మిల గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు వైఎస్ షర్మిల లోటస్ పాండ్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పుట్టినరోజు అయిన జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. పార్టీ ఆవిర్భావానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్రెడ్డి సంక్షేమ పాలనను మరోసారి తెలంగాణలో తీసుకురావడమే లక్ష్యంగా తమ పార్టీ ఏర్పడుతుందని షర్మిల బృందం పేర్కొంది.