S Sharmila Fires On Revanth Reddy In Kodangal: వికారాబాద్లోని కొడంగల్లో పర్యటించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్లని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ను ఓడించారని అన్నారు. ముఖం చెల్లని రేవంత్ను రాష్ట్రానికి అధ్యక్షుడు చేశారని ఎద్దేవా చేశారు. కొడంగల్లో ముఖం చెల్లని రేవంత్ మొహం.. రాష్ట్రం మొత్తం చెల్లుతుందా? అంటూ ప్రశ్నించారు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి, కానీ ఇంట్లోనే గెలవని వ్యక్తి రాష్ట్రంలో గెలుస్తాడా?’ అని నిలదీశారు. ఆ దొంగ పోయాడనుకుంటే, ఇప్పుడు మరో దొంగ వచ్చాడని.. అతనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని విమర్శించారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ.. ఆ ఎమ్మెల్యే అక్రమంగా సంపాదిస్తున్నాడని ఆరోపించారు.
కొడంగల్ను బంగారు కొడంగల్గా చేస్తానని చెప్పిన హరీశ్ రావు.. అలా చేశారా? అని షర్మిల నియోజకవర్గ ప్రజల్ని అడిగారు. చిన్న దొర కెటిఆర్ వచ్చి కొడంగల్ను దత్తత తీసుకొని, సిరిసిల్లలా అభివృద్ధి చేస్తానని మాటిచ్చారన్నారు. దత్తత కాదు కదా, కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. చిన్న దొర కాలికి దెబ్బ తగిలితే, ఆయన మెదడు పని చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా కొడంగల్ అభివృద్ధి లేదని, సేవ చేస్తారని నమ్మి ఓటేస్టే వాళ్లు మోసం చేశారని ఆరోపణలు చేశారు. పోలీస్లను పనోళ్లులా వాడుకుంటున్నారని.. ఎదురు తిరిగితే బెదిరింపులకు పాల్పడటంతో పాటు ప్రాణాలు తీస్తున్నారన్నారు. ఒక్క కొడంగల్లోనే కాదు.. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన సాగుతుందని, మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
అన్ని పథకాలను ఆపేసి, రూ. 5 వేలు రైతుబందు గొప్పగా ఇస్తున్నానని కేసీఆర్ చెప్పుకుంటున్నారని షర్మిల తెలిపారు. రూ. 5 వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా? అంటూ ప్రశ్నించారు. వరి వేసుకుంటే ఉరి అని చెప్పిన సన్నాసి కేసీఆర్ అని, ఏ వర్గాన్ని ఆదుకోలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ది అని తారాస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో రైతుకు భీమా రావాలంటే, 59 ఏళ్లకే చనిపోవాలని.. కేసీఆర్ మాత్రం 69 ఏళ్లు బ్రతకడంతో పాటు పదవులు అనుభవించాలన్నారు. ఉద్యోగాలు లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఉద్యమం సమయంలోనే నేను, నా పెళ్లామే అని చెప్పి.. ఆ తర్వాత పదవుల కోసం కుటుంబం మొత్తం దిగిపోయిందన్నారు. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు కూలీ పనులు చేసుకోవాలి.. కేసీఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలా? అంటూ కడిగిపారేశారు.
మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని షర్మిల ధ్వజమెత్తారు. తెచ్చిన అప్పులు మొత్తం కమీషన్ల రూపంలో కేసీఆర్ తినేశారన్నారు. గోల్కొండ సిపాయి గోడ కడితే కోడిగుడ్డు తగిలి గోడ కూలిందన్నట్టు.. కేసీఆర్ సిపాయి మెగా కృష్ణారెడ్డి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లలో మునిగిపోయిందని సెటైరిక్గా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎన్ని బాహుబలి మోటర్లు పెడితే ఏం లాభమని, కనీసం ప్రొటెక్షన్ వాల్ కూడా సరిగా కట్టలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతే, కనీసం చర్యలు కూడా తీసుకోలేదని.. అందుకే ప్రాజెక్టులన్నీ మెగాకే ఇస్తున్నారని చెప్పారు. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ మనిషి అని.. కమీషన్ల కోసమే తన స్నేహితుడైన మెగాకి కేసీఆర్ అన్ని ప్రాజెక్టులు ఇస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబానికి, మెగా కృష్ణారెడ్డికి మాత్రం బంగారు తెలంగాణ అయ్యిందని షర్మిల దుయ్యబట్టారు. ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రంలో అవినీతి జరుగుతోన్నా.. ప్రతిపక్షాలు మాత్రం ప్రశ్నించకుండా మిన్నకుండిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి జంప్ అవుతూ.. రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని.. విభజన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని వైఎస్ షర్మిల చెప్పారు.