Site icon NTV Telugu

West Zone DCP: డ్రగ్స్ దొరికాయి.. పార్టీలో పాల్గొన్న 148 మందిపై నిఘా పెడతాం

Pub Min

Pub Min

హైదరాబాద్ బంజారాహిల్స్‌ ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్ కేసుపై పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. గత రెండు నెలలుగా డ్రగ్స్‌ విషయంలో అనేక కేసులు నమోదు చేశామని.. పబ్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లను కలిగి ఉన్న అన్నింటికీ మెసేజ్‌లు ఇచ్చామన్నారు. గత రాత్రి పబ్‌లో రాడిసన్ గ్రూప్ వారు అనుమతి తీసుకుని తెల్లారే వరకు మద్యం సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. 24 గంటల అనుమతి ఉందంటూ కస్టమర్లకు చెప్పి పబ్‌కు రప్పించుకుంటున్నారని వివరణ ఇచ్చారు. పబ్‌లోకి కేవలం వీఐపీ, హైఫై సెలబ్రిటీలకు మాత్రమే అనుమతి ఉందన్నారు.

అయితే పార్టీలో డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో దాడులు చేశామని.. ఆ సమయంలో పబ్‌లో 148 మంది ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. అందులో 100 మంది వరకు మద్యం సేవించినట్లు గుర్తించామన్నారు. పబ్‌లోకి వెళ్లడానికి కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారని.. కోడ్ చెప్పిన వాళ్లనే పబ్‌లోకి అనుమతించారని తెలిపారు. పబ్‌లో యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయినవారికీ ఓటీపీ ఇచ్చి ఎంట్రీ తీసుకుంటున్నారన్నారు. అనిల్ కుమార్, అభిషేక్ ఉప్పాల ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని.. అనిల్ కుమార్ దగ్గర ఐదు ప్యాకెట్ల కొకైన్ లభించినట్లు వెల్లడించారు. కస్టమర్ల అందరి వివరాలు తీసుకున్నామని.. వారిపై ప్రత్యేకంగా నిఘా పెడతామన్నారు.

https://ntvtelugu.com/did-nagababu-make-a-mistake-by-releasing-the-video-about-niharika/

Exit mobile version