Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!

Warangal Politics

Warangal Politics

Warangal Politics: కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన పరిణామం వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు కొండా సురేఖ అనుచరుల్లో ఆందోళన నెలకొనగా.. మరోవైపు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు కూడా అలకతో సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో వరంగల్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవిలో ఉన్న సమయంలో కొండా సురేఖకు అండగా నిలిచిన అనుచరులు.. తాజా పరిణామాల తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తమపై కూడా పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే భయంతో కొందరు కొండా సురేఖకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు పొందిన కొండా అనుచరుల్లో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

తమ పదవులకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న ఆందోళనతో కొందరు అనుచరులు ప్రస్తుతం బహిరంగంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె అనుచరులకు దక్కిన కొన్ని ఏజెన్సీలపై కూడా అధికారుల దృష్టి పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని కొండా అనుచర వర్గంలో టెన్షన్ నెలకొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వరంగల్ కాంగ్రెస్‌లో మరో వర్గంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచిన కొందరు సీనియర్ నేతలు తమకు కీలక పదవులు దక్కుతాయని ఆశించినట్లు సమాచారం. అయితే తాజాగా గుండు సుధారాణికి కూడా ఛైర్మన్ పదవి దక్కడంతో వారి అంచనాలు తారుమారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో వరంగల్ మేయర్‌గా పనిచేసిన గుండు సుధారాణికి పార్టీ మారిన వెంటనే కీలకమైన ఛైర్మన్ పదవి కేటాయించడంపై కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము పార్టీ కోసం పనిచేస్తూ, అధిష్టానం నిర్ణయాలకు మద్దతుగా నిలిచినా.. తమను పక్కనపెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై వారు పెదవి విరుస్తున్నట్లు సమాచారం.

మరోవైపు కూడా ఛైర్మన్ పదవిపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జంగా రాఘవరెడ్డి పేరు కూడా ఈ పదవి కోసం వినిపించినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ అనుచర వర్గానికి ఛైర్మన్ పదవి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన వెంటనే కొందరు కాంగ్రెస్ నేతలు సంబరాలకు సిద్ధమైనట్లు కూడా చర్చ జరిగింది. అయితే గుండు సుధారాణికి ఛైర్మన్ పదవి దక్కడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాము ఆశించిన పదవులు దక్కకపోవడంతో కొందరు నేతలు ప్రస్తుతం మౌనంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా కొండా సురేఖ బర్తరఫ్‌తో వరంగల్ కాంగ్రెస్‌లో ఒక అధ్యాయం ముగిసిందా? లేక కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది నాంది పలకనుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కొండా అనుచరుల్లో పదవుల భయం.. మరోవైపు గుండు సుధారాణికి పదవి కేటాయింపుపై సీనియర్ల అసంతృప్తి.. ఇలా రెండు వర్గాల్లోనూ అసహనం కనిపిస్తుండటంతో వరంగల్ రాజకీయాలు ప్రస్తుతం ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది.