బిజెపిలో ఈటెల చేరికపై అన్ని పార్టీలు స్పందిస్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లు స్పందించగా తాజాగా బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్నారని మండిపడ్డారు. “సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు లేరన్న ఈటల గారి ప్రకటనపై ముందుగా ఎందుకు చెప్పలే…. అని టీఆరెస్ ప్రతి విమర్శలు చేసే బదులు, వెంటనే నియామకం చెయ్యవచ్చు. సమర్థులైన ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఉన్నారు కదా? సీఎం గారి కుటుంబ దోపిడీ కథలు వేరే అధికారులొస్తే బయటపడతాయని భయమేదైనా ఉందా? కాంగ్రెస్ నుంచి గెలిచిన అనేకమంది ఎమ్మెల్యేలను పదవితో సహా గుంజుకున్న టీఆరెస్… ఈటలగారు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్రు. “నక్సలైట్ ఎజెండా నా ఎజెండా…” అని చెప్పిన కేసీఆర్ గారు, వరంగల్ బిడ్డలు శృతి, సాగర్లను ఎన్కౌంటర్ చెయ్యొచ్చు… సీఎం అండ్ కో వేల ఎకరాల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడవచ్చు. ఈటల భావజాలం మాత్రం ప్రశ్నిస్తాం… అంటున్న టీఆరెస్ పార్టీకి ఇదంతా కేవలం బీజేపీలో చేరికపై భయంతోనే అన్నది స్పష్టం. రైతు చట్టాలపై ఈటలగారు బీజేపీతో మాట్లాడాలంటున్న టీఆరెస్… ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ రైతులనెందుకు పలుకరించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. టీఆరెస్ బాజాప్తాగా మతతత్వ ఎంఐఎంతో అవగాహన కొనసాగితే అది సెక్యులరిజం… కోట్లాది భారతీయుల ఆదరణతో ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ముందుకెళ్తున్న బీజేపీలో చేరటం మాత్రం అలౌకిక వాదమా? ఇది కేవలం మెజారిటీ హిందువుల పట్ల టీఆరెస్ తేలిక భావమే.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.