Uttam Kumar Reddy Fires On PM Narendra Modi: గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాను ఇచ్చిన వాగ్దానాలను ఇంతవరకూ నెరవేర్చనందుకు మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. 2016లో చేసిన ప్రసంగంలో భాగంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని.. అలాగే అందరికీ ఇల్లు ఇవ్వడంతో పాటు దేశమంతటికీ విద్యుద్దీకరణ చేస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. అయితే.. 2022 వచ్చినా ఆ వాగ్ధానాల్లో ఏ ఒక్కటి పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. మోదీకి 2022 సంవత్సరం ఎప్పుడు వస్తుందో, 2022 నాటికి పూర్తి చేస్తానని తానిచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో వివరించాలని నిలదీశారు. బూటకపు వాగ్దానాలు చేసేందుకు గత ఎనిమిదేళ్ల నుంచి మోదీ స్వాతంత్ర దినోత్సవాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2016 నుంచి రైతుల సాగు ఆదాయం ఏమాత్రం పెరగలేదని.. గత ఎనిమిదేళ్లలో ఇన్పుట్ ఖర్చు రెండింతలు పెరిగిందని ఉత్తమ్ కుమార్ అన్నారు. 2014లో మాదిరిగానే రైతులు ఆదాయం ఇప్పటికీ సగటున రోజుకు రూ. 27 ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల పంట నష్టం వాటిల్లిందని.. అనేక పంటలకు సరైన మద్దతు ధరలు లేకపోవడంతో, సాగులో నష్టపోయి వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తే, ప్రస్తుత మోదీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల వివరాలను దాచిపెట్టేందుకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి డేటాను విడుదల చేయడం మానేసిందన్నారు. రైతులను మోసం చేయడంలో ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకరిస్తున్నారని ఆరోపించారు. పంట రుణాలు మాఫీ చేస్తామన్న హామీని ఇంతవరకూ అమలు చేయలేదని, తెలంగాణలో ఒక్క రైతుకు కూడా పంటల బీమా వర్తించని విధంగా తప్పుడు విధానాలు అమలు చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యల లెక్కలను చూపడం లేదని ఆరోపణలు చేశారు.
2022లో అందరికీ ఇల్లు ఇస్తామని మోదీ చేసిన హామీని గుర్తు చేస్తూ.. 60 లక్షల మందిలో 50% మందికి కూడా ఇల్లు ఇవ్వలేదన్న నిజాన్ని, పీఎం ఆవాస్ యోజన వెబ్సైట్లో ఉన్న డేటా చెబుతోందని ఉత్తమ్ తెలిపారు. మోదీలాగే కేసీఆర్ కూడా ఇల్లు ఇస్తామన్న హామీని మరిచారని, మంజూరైన 2.75 లక్షల 2BHK యూనిట్లలో 10% కూడా నిర్మించలేదన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్డి వంటి మౌలిక వసతులు కల్పిస్తామన్న హామీని నెరవేర్చడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామమైన ఒడిశాలోని ఉపర్బేడకు.. ఈ ఏడాది జూన్లో ఆమె నామినేషన్ దాఖలు చేసిన తర్వాతే తొలిసారిగా విద్యుత్ సౌకర్యం లభించిందని తెలిపారు. 2022 నాటికి ‘పౌష్టికాహార లోప రహిత భారతదేశం’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాని మోదీ 2018లో ‘పోషణ్’ అభియాన్ను మోదీ ప్రారంభించారని.. కానీ అందులో ఎలాంటి మెరుగుదల లేదన్నారు. దానికి బదులు 13 రాష్ట్రాల్లో పోషకాహార లోపం కేసులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన భారతదేశం.. శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల కంటే వెనుకబడి ఉందన్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ వంటి ఆకర్షణీయమైన నినాదాలతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారని ఉత్తమ కుమార్ విమర్శించారు. ఇప్పుడు మాట్లాడుతున్న ‘అమృత్ కల్’ని విశ్లేషిస్తే.. 2047 లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని అర్థమవుతోందన్నారు. తన ప్రసంగాల్లో అవినీతి గురించి మాట్లాడే మోదీ.. మోసగాళ్లపై మాత్రం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉంటున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో బ్యాంకు మోసాలు రూ. 5.35 లక్షల కోట్లు జరిగాయన్నారు. విజయ్ మాల్యా, మెహుల్ చౌకాసీ, నీరవ్ మోదీ వంటి మోసగాళ్లను పట్టుకోకుండా.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం కోసం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ఏజెన్సీలను మోదీ ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని, స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని రాజకీయం చేయడం ద్వారా ప్రధాని మోదీ రాజకీయ దౌర్భాగ్యానికి పాల్పడ్డారన్నారు. అలాగే బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, హత్య దోషుల్ని విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. వారికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలకడం చాలా సిగ్గుచేటని.. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఉత్తమ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.