Medico Suicide: హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న కె. భరద్వాజ్ రెడ్డి (18) అనే మెడికో నిర్మాణంలో ఉన్న ఒక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భావి భారత్ వైద్యుడిగా స్థిరపడాల్సిన యువకుడు ఇలా తక్కువ వయసులోనే బలవన్మరణానికి గురికావడంతో ఆయన కుటుంబంలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
తెల్లవారుజాము నుంచే లభించని ఆచూకీ
పోలీసుల కథనం ప్రకారం.. భరద్వాజ్ రెడ్డి తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతం నుంచి కనిపించకుండా పోయాడు. అతను ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు , బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఉదయం 8:30 గంటల సమయంలో స్థానికులు డయల్-100కు సమాచారం అందించడంతో ఉప్పల్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం కింద తీవ్ర గాయాలతో పడి ఉన్న భరద్వాజ్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భరద్వాజ్ రెడ్డి ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, చదువుల ఒత్తిడి లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

