NTV Telugu Site icon

థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి వార్నింగ్

Kishan Reddy

క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాక‌ముందే.. మ‌రోవైపు థ‌ర్డ్ వే భ‌యాలు ప్ర‌జ‌ల‌ను వెంటాడుతున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడ‌ద‌ని సూచించారు.. ఇవాళ హైద‌రాబాద్‌లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సంద‌ర్శించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోంద‌న్నారు.. యూర‌ప్‌, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్‌ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి ప‌నిచేయాల‌న్నారు. ఇక‌, ఆక్సిజన్ ప్లాంట్స్, వ్యాక్సిన్‌లు, మందులు అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు.. తెలంగాణకు 1,400 వెంటిలేట‌ర్ల‌ను 46 ఆస్ప‌త్రుల‌కు ఇచ్చామ‌ని వెల్ల‌డించారు. గత 74 ఏళ్లుగా 18 వేల వెంటిలేట‌ర్లు వినియోగిస్తే.. గత రెండేళ్ల‌లో 50 వేల‌కు పైగా వెంటిలేట‌ర్ల‌ను అద‌నంగా అందుబాటులోకి తెచ్చామ‌న్నారు..

మ‌రోవైపు 200 కోట్ల వ్యాక్సిన్ల‌ను భారత్‌లో తయారు చేసేలా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్నామ‌న్నారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.. భారత్ బయోటెక్ కి 1500 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కోసం అడ్వాన్స్ ఇచ్చామ‌న్న ఆయ‌న‌.. థ‌ర్డ్ వేవ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడ‌ద‌న్నారు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వాళ్ల‌పై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.. కేంద్రం వ్యాక్సిన్‌పై నిర్ణయించిన చార్జీల కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు కిష‌న్‌రెడ్డి.