Department of Food and Public Distribution Given Clarification on the Suspension of Telangana Paddy Procurement.
బియ్యం సేకరణ నిలిపివేయడం పై కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. అన్న యోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటనలో ఆరోపించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సెంట్రల్ పూల్లోకి సేకరించడాన్ని నిలిపివేసిందని, ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ పేర్కొంది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోని వైనాన్ని గమనించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచుల మాయమవడాన్ని గుర్తించామని, డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది.
మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశాన్ని గుర్తించామని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అన్న యోజన పథకం కింద ఏప్రిల్-మే నెలల కోటా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది. కానీ ఆ బియ్యాన్ని లబ్దిదారులకు అందకుండా చేసిందని, ఈ కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెంట్రల్ పూల్లోకి బియ్యం సేకరణను నిలిపివేసిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.