తెలంగాణలో కొత్త లాక్డౌన్ సడలింపులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.. కానీ, కేసుల తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉండగా.. ఇంకా పాజిటివ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉన్నాయి.. అయితే, రెండు జిల్లాలను కలుపుతూ ఉన్న ఒక పంచాయతీలో మాత్రం.. రెండు లాక్డౌన్లు అమలు చేయాల్సిన పరిస్థితి.. అదే ఇటు రంగారెడ్డి జిల్లా, అటు నల్గొండ జిల్లాలను కలుపుతూ ఉన్న మాల్.. కొత్త సడలింపులతో రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉండగా.. నల్గొండ జిల్లాలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే పరిమితం.. దీంతో.. ఈ గ్రామంలో విచిత్రమైన పరిస్థితి తలెత్తింది.. గోడకొండ్ల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు.. మాల్ గ్రామపంచాయతీ పరిధిలో సాయంత్రం 6గంటల వరకు సడలింపులు అమలు చేస్తున్నారు అధికారులు. కాగా, హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవేపై ఉండే మాల్ మంచి వాణిజ్య కేంద్రం.. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు.. హైదరాబాద్ శివారుల నుంచి కూడా కూరగాయలు అమ్మేవారు.. అక్కడికి వెళ్లి కూరగాలు తీసుకువస్తుంటారు.. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. గతంలో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ గ్రామం ఉండేది.. తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత.. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాంతం.. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి రావడంతో.. ఇప్పుడు రెండు జిల్లాల్లో మాల్ గ్రామ పరిధి ఉంది.