నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న రెండు రోజుల్లోగా పదో తరగతి ఫలితాలను సైతం విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను జూలై 1వ తేదీన విడుదల చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును సమీక్షించారు మంత్రి సబితా. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. టెట్ ఫలితాలు వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జూలై 1న ఫలితాలను విడుదల చేయాలని పేర్కొన్నారు.
దీంతో పాటు ఈ నెల 30వ తేదీన పదో తరగతి ఫలితాలను విడుదల చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు. గడచిన రెండేళ్లుగా కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణత సాధిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.