గులాబీ పార్టీ సంబురానికి సర్వం సిద్ధం అయ్యింది.. హైదరాబాద్ గులాబీ మయం అయిపోయింది.. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోన్న వేళ హైదరాబాద్ వేదికగా ప్లీనరీ నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక, ప్రతినిధుల సభ ఈసారి 3 వేల మందితో జరుగనుంది. ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది అధిష్టానం.. ఇక, తోరనాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు.. కటౌట్లు.. ఇలా ఎటు చూసినా గులాబీ రంగు పులుముకుంది.. ఇదే సమయంలో.. వినూత్న తరహాలో ప్రచారం చేస్తోంది టీఆర్ఎస్..
Read Also: TRS Plenary: గులాబీ సంబురం.. సర్వం సిద్ధం..
హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరంతో పాటు.. సాగరంలో తిరిగే బోటు కూడా గులాబీ రంగు పులుముకున్నట్టు అయ్యింది. సాగరంలో విహరించే బోటును సైతం వదలకుండా గులాబీ మయం చేశారు.. తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలతో నింపేశారు.. పార్టీ నేత సతీష్ రెడ్డి ఓ బోటును ఇలా ముస్తాబు చేశారు.. ఇక, రాత్రి సమయంలో.. హుస్సేన్ సాగర్లో విహరిస్తూ.. అందరినీ ఆకట్టుకుంది ఆ బోటు. ఇక, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు, షేర్లు, లైక్లతో వైరల్ చేస్తున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు, అభిమానులు.. కాగా, హైదరాబాద్లో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు… ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయమా? వెంటనే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.
