Uday Krishna Reddy : సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వరకు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు.
కోర్టులో ఉత్కంఠగా సాగిన వాదనలు
అంతకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో డిఫెన్స్ అడ్వకేట్, ప్రాసిక్యూషన్ (పీపీ) మధ్య సుదీర్ఘంగా వాదనలు సాగాయి. డిఫెన్స్ అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 35(3) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని, తన క్లయింట్కు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని తెలిపారు. సరైన ప్రాథమిక విచారణ లేకుండానే సస్పెండ్ చేయడం చట్టప్రకారం చెల్లదని, తగిన ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి రిమాండ్ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
వరుస ఫిర్యాదులు.. తీర్పు రిజర్వ్ నుంచి రిమాండ్ వరకు
మరొకవైపు బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి జూలై 15న నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) లోనూ, ఆ తర్వాత జూలై 17న పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు అకాడమీ కూడా ఆగస్టు 5న హాజరుకావాలని ఉదయ్ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిందని వివరించింది. ఇరువర్గాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం మొదట తీర్పును రిజర్వ్లో ఉంచి, అనంతరం రిమాండ్ విధిస్తూ నిర్ణయం ప్రకటించింది.

