హైదరాబాద్నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులో ముస్లింలు, మత పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
చాపెల్ రోడ్డు మీదుగా జగ్జీవన్ రామ్ విగ్రహం జంక్షన్ వైపు వచ్చే వాహనాలను పోలీస్ కంట్రోల్ రూం మీదుగా దారి మళ్లిస్తామన్నారు. గన్ ఫౌండ్రీలోని ఎస్బీఐ మీదుగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని తెలిపారు. రవీంద్ర భారతి నుంచి జగ్జీవన్రామ్ విగ్రహం కూడలి వైపు వచ్చే వాహనాలను సుజాత ఉన్నత పాఠశాల, పతే మైదాన్ మీదుగా దారి మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. నారాయణగూడ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్నగర్ జంక్షన్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. కింగ్ కోఠి నుంచి బొగ్గులకుంట మీదుగా బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను… పబ్లిక్ గార్డెన్ వైపు నుంచి వెళ్లేలా దారి మళ్లిస్తామన్నారు.
Cyber Crime: గూగుల్ సెర్చ్ చేశాడు.. రూ.లక్ష పోగొట్టుకున్నాడు
