TPCC Mahesh Goud : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీల (DCC) నియామక ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తొలి విడతగా రాష్ట్రంలోని 14 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటించారు.
గత పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే ఈ కమిటీల నియామకంపై పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. నియామకాల్లో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు మహేష్ కుమార్ గౌడ్ నిన్న రాత్రి వరకు తీవ్రంగా కసరత్తు చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో సుదీర్ఘంగా చర్చించి, వారిని సమన్వయపరుస్తూ ఈ జాబితాను ఖరారు చేశారు. గతంలో వేసిన స్క్రీనింగ్ కమిటీ సూచనలను పాటిస్తూనే, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ కమిటీల్లో పెద్దపీట వేశారు.
Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే
ఈ ప్రకటనలో కేవలం అధ్యక్షులను మాత్రమే కాకుండా, జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే పూర్తి స్థాయి యంత్రాంగాన్ని నియమించారు. ప్రతి జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కమిటీలను ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం భావిస్తోంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యచరణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంపై ఎక్కువ ఫోకస్ చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీలు పనిచేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. మొదటి విడతలో 14 జిల్లాలను ప్రకటించగా, మిగిలిన జిల్లాల కమిటీలను కూడా త్వరలోనే వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకాలతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోష్ నెలకొంది.