తెలంగాణలో బీసీలతో పాటు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు. సర్వాయి పాపన్న వంటి వీరుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గొప్పతనాన్ని వివరిస్తూ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎంతో మంది రాజులు, చక్రవర్తులు చరిత్రలో ఉన్నప్పటికీ, చిన్న జాతిలో పుట్టి పోరాటంతో రాజుగా ఎదిగిన వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు. పుట్టుకతోనే చక్రవర్తులుగా మారిన వారితో పోలిస్తే, పాపన్న పోరాడి రాజయ్యారని పేర్కొన్నారు. “మేము రాజులమే.. మేము కూడా పాలించగలుగుతాం” అనే ఆత్మవిశ్వాసాన్ని పేద, వెనుకబడిన వర్గాల్లో కల్పించిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న అని మహేష్ కుమార్ అన్నారు. పేద వర్గాల కోసం పాపన్న పోరాటం చేశారని గుర్తు చేశారు.
సెక్రటేరియట్ ముందు సర్వాయి పాపన్న విగ్రహం
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుల పెద్దలతో చర్చించి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మహేష్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్లు చెప్పారు. సెక్రటేరియట్ ముందు సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. విగ్రహాలు కేవలం పూలమాలలు వేసేందుకు మాత్రమే కాదని, ఆయా మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగేందుకే విగ్రహాలను ఏర్పాటు చేయాలని మహేష్ కుమార్ అన్నారు.
జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు కూడా
సామాజిక సంస్కర్తలు జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను కూడా ఆవిష్కరించనున్నట్లు మహేష్ కుమార్ తెలిపారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలు, మహిళలు, పేదల కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
రాహుల్ గాంధీ నినాదంతో కులగణన
రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని మహేష్ కుమార్ పేర్కొన్నారు. “ఎవరు ఎంతో.. వారికి అంత” అనేది రాహుల్ గాంధీ నినాదమని తెలిపారు. అదే నినాదంతో తెలంగాణలో కులగణన చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే అసెంబ్లీలో కులగణనకు మద్దతు ఇచ్చిన బీజేపీ.. కేంద్ర స్థాయిలో మాత్రం దానిని అడ్డుకుంటోందని విమర్శించారు.
‘మేము ఎవరికీ వ్యతిరేకం కాదు’
బీసీలు తమ హక్కుల కోసం పోరాడితే కొందరు దానిని ఇతరులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తున్నారని మహేష్ కుమార్ అన్నారు. “మా హక్కుల కోసం మేము పోరాడితే.. మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు” అని స్పష్టం చేశారు. అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ కులం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలిసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతు ఇచ్చారని, కులగణన చేపట్టారని పేర్కొన్నారు. ఎవరినీ ఇబ్బందులకు గురి చేయకుండా అన్ని కులాలను కలుపుకుని సమాన అవకాశాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
కులాల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాలి
మంత్రిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ గౌడ్ పార్టీలకు అతీతంగా బీసీల కోసం, కులాల సంక్షేమం కోసం పనిచేశారని మహేష్ కుమార్ పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీలతో పాటు ఇతర కులాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవుల్లో కూడా సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. 79 శాతం ఉపాధ్యక్ష పదవులను బీసీలకు ఇచ్చామని, అదే సమయంలో అన్ని కులాలకు సమానంగా అవకాశాలు కల్పించామని మహేష్ కుమార్ వెల్లడించారు. కులాల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం లభించేలా ముందుకు సాగడమే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.

