NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు షాక్..

వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు షాక్ ఇచ్చారు. అనారోగ్య వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నానని మీడియాసమావేశంలో వెల్లడించారు. 2009లో ప్రజారాజ్యం తరఫున తొలిసారి ఆయన పోటీ చేశారు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగి 2014లో టీడీపీలో చేరారు.. అనంతరం భారీ బహిరంగ సభ పెట్టి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.. ఇక, 2019లో వైఎస్ఆర్సీపీలో చేరి సీఎం జగన్ తర్వాత 80 వేల పైచిలుకు మెజారిటీతో అన్నా రాంబాబు గెలిచారు. తాజాగా ఆనారోగ్య కారణాలతో పోటీ చేయటం లేదంటూనే పలువురు వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

28 ఏళ్ల క్రితం హత్య.. నిందితుడు అరెస్ట్

చెన్నైలో 28 ఏళ్ల క్రితం భార్య విడాకుల ఫిర్యాదుతో అత్తను హతమార్చిన వ్యక్తిని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు చాలారోజులుగా వెతుకుతుండగా.. మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు హరిహర్ పట్టాజోషి (51) కోసం వారం రోజులపాటు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గోసానినుగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు దాక్కున్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నట్లు బెర్హంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేక్ ఎం శరవణ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 1994లో చెన్నైలోని ఓ అడ్వర్టైజింగ్‌ కంపెనీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్న పట్టాజోషి.. మరో కంపెనీలో టెలిమార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల ఇందిరతో ప్రేమలో పడ్డాడు. అనంతరం జూలై 1994లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే వారిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

డిసెంబ‌ర్ 28కు ఎంతో చారిత్రక నేప‌థ్యముంది

డిసెంబ‌ర్ 28కు ఎంతో చారిత్రక నేప‌థ్యముంద‌ని, అందుకే అదేరోజున ప్ర‌జా పాల‌న‌కు శ్రీ‌కారం చుడుతున్నామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ , శిశు సంక్షేమ‌శాఖ మంత్రి సీత‌క్క అన్నారు. ఆదిలాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలిసారిగా ఉమ్మ‌డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన ఆమె ఉన్న‌తాధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ప్ర‌జా పాల‌న‌పై స‌మీక్షా స‌మావేశం ముగిసిన అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజా పాలనకు నాంది ప‌లుకుతున్నామ‌న్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధికే కట్టుబడి ఉంటుందని స్ప‌ష్టం చేశారు. సబ్బండవర్ణాలను దృష్టిలో పెట్టుకొనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామ‌ని మాట ఇచ్చాన‌మ‌ని, దానిని త‌ప్ప‌కుండా నిల‌బెట్టుకుంటామ‌ని వెల్ల‌డించారు. అందుకోసం వంద‌రోజుల టైం బాండ్ పెట్టుకున్నామ‌ని, క‌చ్చితంగా నెర‌వేర్చి తీరుతామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఎంతో చారిత్రాత్మకమైన సందర్భం డిసెంబల్ 28 అంటూ చెప్పారు. ఆ సంద‌ర్భంలోనే ప్ర‌జా పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టి ముందుకు సాగుతామ‌ని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో టికెట్ల కోసం ఆందోళన సహజం..

ఎన్నికల సమయంలో టికెట్ల కోసం ఆందోళన సహజం అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. టికెట్ల కోసం డిమాండ్ లేక పోతే ఎత్తిపోయిన పార్టీ అంటారు.. మా ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము.. పార్టీ నేతల్లో ఏమైనా అసంతృప్తి వుంటే పిలిచి మాట్లాడతాం.. ఆ మాత్రం పోటీ, ఆందోళనలు లేకపోతే పార్టీ ఉన్నట్లు ఎలా తెలుస్తుందని ఆయన చెప్పారు. టీడీపీ లో పొలిట్ బ్యూరో తీర్మానాలు అన్నీ మొక్కుబడిగా తయారు అవుతాయి.. వైసీపీలో నాయకత్వానికి గుర్తింపు ఉంటుంది.. వందల్లో, వేలల్లో నాయకులు ఉంటారు.. కానీ కింది స్థాయిలో కార్యక్రమాలు జరగాలి.. ఒక కార్యక్రమానికి ముందు గ్రౌండ్ ప్రిపరేషన్ ముఖ్యం.. మెయిన్ స్ట్రీమ్ మీడియాను దాటి సోషల్ మీడియా వ్యవహరిస్తోంది.. ప్రత్యర్థులు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టండి అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

న్యూయర్‌ వేడుకల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పలు ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. 31, డిసెంబర్ 2023 నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

• నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు.
• PVNR ఎక్స్ప్రెస్ వే రాత్రి రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు.
• ఈ క్రింది ఫ్లై ఓవర్లు రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేయబడతాయి:
1. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, 2. గచ్చిబౌలి ఫ్లైఓవర్, 3. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (1 & 2), 4. షేక్ పేట్ ఫ్లైఓవర్, 5. మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, 6. రోడ్ నెం.45 ఫ్లైఓవర్ మరియు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, 7. సైబర్ టవర్ ఫ్లైఓవర్, 8. ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, 9. ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, 10. బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్).
ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అభ్యర్ధన.

ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టు విచారణ

ప్రభుత్వ జీఓలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడంపై దాఖలపై పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పటిషనర్ల వాదన విన్న న్యాయస్థానంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారించిన కోర్టు జీవోలను RTI ద్వారా పొందవచ్చు కదా అని పటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా.. జీవోలు విడుదలయినట్లు కూడా తెలియడం లేదని, అటువంటప్పుడు ఆర్‌టీఐ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జి.వోలను ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం పౌరుల ప్రాధమిక హక్కులకు విఘాతం కలిగించడమే పటిషనర్లు పేర్కొన్నారు.

ప్రజల వద్దకే పాలన వెళ్ళాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం

సంగారెడ్డి ప్రజా పాలన సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన వెళ్ళాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, గత ప్రభుత్వంలో జనం సమస్యలు చెప్పుకునే అవకాశం లేదన్నారు కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి సందేశం ప్రజలకు వినిపించిన తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని, అధికారులు తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, IAS, IPS అధికారులకు పనితనాన్ని బట్టే ప్రమోషన్లు ఉంటాయని సీఎం చెప్పారు.. బాగా పని చేయండన్నారు. మేం పాలకులం కాదు సేవకులమని ఆమె వ్యాఖ్యానించారు. ఇల్లు అలకగానే పండగ కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిన..ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కృషి చేస్తున్నామన్నారు కొండా సురేఖ.

ఎస్టీ కాలనీ వాసుల కరెంట్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి

మార్కాపురం పట్టణంలోని 15వ వార్డులో సుమారు 30 సంవత్సరాల నుంచి జంగాళవారు నివాసముంటున్నారు వారికి విద్యుత్ స్థంబాలు లైట్లు లేక కటిక చీకట్లో జీవిస్తున్నారు. అయితే, ఈ మధ్య గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఎస్టీ కాలనీకి వెళ్ళేటప్పటికి రాత్రి సమయం కావడంతో అంతా చీకటిగా ఉన్నది.. స్థానిక ప్రజలను పిలిచి ఇంత చీకటిగా ఉంది.. ఎలా ఉంటున్నారు అని అడుగగా గత పాలకులకు అర్జీలు ఇచ్చినా ఉపయోగం లేదు.. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని స్థానికులు చెప్పారు. దీంతో వారి ఇబ్బందులు చూసిన మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి త్వరలో మీ సమస్య తీరుస్తా అని మాటిచ్చారు.

గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం

గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే‌ను కలిసేందుకు వచ్చిన అంగన్వాడి వర్కర్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా ఎమ్మెల్యే కొడాలని నాని కలిసి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం అంగన్వాడీ వర్కర్స్ గుడివాడ క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని మధ్య దారిలో ఆపేశారు. అయినా అంగన్వాడీలు వెనక్కి తగ్గేది లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బలవంతంగా అంగన్వాడి వర్కర్లను అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే వారికి మద్దతు తెలిపిన సీఐటీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ వైఖరి, పోలీసులు తీరుపై అంగన్వాడీ వర్కర్స్ మండిపడ్డారు. తమకు సమస్యలు విన్నవించుకనే అవకాశం కూడా ఈ ప్రభుత్వం కల్పించడంలేదాని వాపోయారు. న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించమంటే పోలీసుల చేత తమను అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాందంటూ వైసీపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు

తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరపత్రాలు పంచడం అంటే రాజకీయంగా దిగజారాడమేనని ఎమ్మెల్యే అన్నారు. నేను వ్యాపారాలు చేసి భూములు కొన్నాము.. గతంలో జేసీ దివాకర్ రెడ్డి గెలుపు కోసం మీకు మేము చెందాలు ఇచ్చాము.. గతంలో మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో జేసీ కుటుంబ గుర్తించుకోవాలి అని ఆయన చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విద్యుత్ స్తంభాలకు ఉన్న వైసీపీ జెండాలు తీసివేయమని లెటర్ ఇచ్చాడు.. నేను కష్టపడి ఆస్తులు కొన్నాను.. జేసీ ప్రభాకర్ రెడ్డి కష్టపడి ఆస్తులు కొన్నాను అని చర్చకు రావాలి.. మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో రూములు ఇప్పించి వాటి పల్లన వచ్చే అధిక బడుగలతో జేసీ కుటుంబ నడుస్తుంది.. నేను ఇప్పుడు ఫ్యాక్షన్ జోలికి వేళ్ళను అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు.

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ అరెస్టుకు యత్నం

మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ముందస్తు అరెస్టుకు పోలీసులు యత్నించారు. బుధవారం భాగ్యనగరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే అదే ఊర్లో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. దీంతో అఖిల ప్రియను ఆ ఊరికి వెళ్లకుండ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఆమె కారును అడ్డుకున్నారు.

తను వెళ్లడం వల్ల అక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అఖిల ప్రియకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె పట్టు వీడకపోడంతో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ మంత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు. అఖిల ప్రియ అరెస్టుకు పోలీసులు యత్నించడంతో అక్కడికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సీఎస్ జవహర్ రెడ్డికి ఏపీ టీడీపీ చీఫ్ లేఖ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. లిక్కర్ అమ్మకాల వివరాలను ఆన్ లైన్ లో నుంచి తప్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లేఖలో అచ్చెన్నాయుడు రాసిన వివరాలు.. లిక్కర్‌ అమ్మకాలు, ఆదాయాలకు సంబంధించిన డేటాను వైసీపీ ప్రభుత్వం వెబ్ సైట్ నుంచి తొలగించింది అని విమర్శలు గుప్పించారు. లిక్కర్ ఆదాయం ఎక్కడికి వెళుతోందో మీకు తెలుసే ఉంటుంది.. దేశ వ్యాప్తంగా పారదర్శకత కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు మళ్లుతుంటే ఏపీలో మాత్రం క్యాష్ ట్రాన్సాక్షన్‌లో మాత్రమే అమ్మకాలు చేస్తోంది అని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.