Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..

  • రాష్ట్రవ్యాప్తంగా 12 మంది తహశీల్దార్ల బదిలీ
  • డీఆర్ఓ, ఎస్‌డీసీ పోస్టుల్లో కొత్త నియామకాలు
  • పరిపాలనా అవసరాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం
  • వెంటనే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు
Telangana Logo

Telangana Logo

Tahsildar Transfers : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనాపరమైన అవసరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 12 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులకు తక్షణమే అమల్లోకి వచ్చేలా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు (DRO) , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (SDC, Land Acquisition) గా కొత్త పోస్టింగులను కేటాయించారు. ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి నివేదికను, అధికారులు విధుల్లో చేరిన వివరాలను ప్రభుత్వానికి తక్షణమే సమర్పించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) తో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

 

ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన వారిలో నిర్మల్ తహశీల్దార్ మోతీరామ్ ఎ. ను మంచిర్యాల డీఆర్ఓగా, కరీంనగర్‌కు చెందిన బి. రాజేశ్వరిని పెద్దపల్లి డీఆర్ఓగా, పెద్దపల్లికి చెందిన కె.వై. ప్రసాద్‌ను జగిత్యాల డీఆర్ఓగా నియమించారు. అలాగే వనపర్తి నుంచి ఆర్. పాండును నాగర్‌కర్నూల్ డీఆర్ఓగా, ఖమ్మం నుంచి వి. రవికుమార్‌ను ములుగు డీఆర్ఓగా, మేడ్చల్-మల్కాజిగిరి నుంచి జె. స్వామిని కరీంనగర్ డీఆర్ఓగా, నాగర్‌కర్నూల్ నుంచి ఎ. పాండును కామారెడ్డి డీఆర్ఓగా బదిలీ చేశారు. వీరితో పాటు జనగామ తహశీల్దార్ సిహెచ్. శ్రీకాంత్‌ను మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియమించగా, ఎం. సుదర్శన్ రెడ్డి (సూర్యాపేట) ను సిద్దిపేట ఎస్డీసీగా, ఎం. రమాదేవి (ఖమ్మం) ను నల్గొండ ఎస్డీసీగా, జి. కుమారస్వామి (పెద్దపల్లి) ను సిరిసిల్ల ఎస్డీసీగా , ఎన్. వెంకట్ రెడ్డి (కరీంనగర్) ను కరీంనగర్ ఎస్డీసీ (ఎల్ఏ) గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.