Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!

Rythubharosa

Rythubharosa

Rythu Bharosa: రాష్ట్రంలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వేదికగా అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసిందని సీఎం వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమ 30 నెలల ప్రజాపాలనలో అన్నదాతలు ఎల్లప్పుడూ తలెత్తుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని, వ్యవసాయం దండగ కాదని, దానిని ఒక పండుగగా భావించేలా రాష్ట్రంలో అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తాజాగా ఈ రోజు 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలుకు సంబంధించిన అధికారిక లెక్కలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన రెండవ దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10.68 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1,590.02 కోట్లు జమ అయ్యాయి. అంతకుముందు మొదటి దశలో భాగంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 2,482 కోట్లను జమ చేసిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 54.96 లక్షల మంది రైతులకు చెందిన 67.87 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లింపులు జరిగాయని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం రూ.4,072.04 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు.