Site icon NTV Telugu

Telangana: 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

Red Alert

Red Alert

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు వీటి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రాబోయే 2 రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య, వాయువ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర- వాయువ్య, ఈశాన్య జిల్లాల్లోనే అనేక పట్టణాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు వరదలు వచ్చే అవకాశం ఉందని.. పంట పొలాలు నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ హెచ్చరించింది.

Read Also: Sarkaru Vaari Paata: ఈ మార్పులు చేసుంటే.. మరో వంద కోట్లు వచ్చేవి

ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం రోజు నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదు అయింది. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైంసా, బాసర పట్టణాల్లోని లోతట్టు కేంద్రాలు నీటిలో మునిగాయి. దీంతో బాధితులను అధికారాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల జిల్లాల్లో అధికారులతో సమీక్షించారు.

భారీ వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పొంగిపొర్లుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరం పార్వతి బ్యారేజ్ 30 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతుండటంతో 9 గేట్లు ఎత్తివేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు.

Exit mobile version