మారుతున్న కాలంలో మానవ సంబంధాలు బలహీనపడుతున్న తరుణంలో, కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారి జీతాల నుంచే కొంత భాగాన్ని కోత విధించి నేరుగా తల్లిదండ్రులకు అందజేసేలా రూపొందించిన “తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026″ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అత్యంత సామాజిక బాధ్యతతో కూడిన అంశంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి, పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం ఒక హక్కుగా భావించాలని, ప్రేమతో సేవ చేయని వారు కనీసం చట్టం పట్ల భయంతోనైనా వారిని ఆదుకోవాలన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రేమలు పంచాల్సిన చోట ఇలాంటి చట్టాలు తేవాల్సి రావడం నిజంగా బాధాకరమని, పిల్లలను కనగలం కానీ వారి బుద్ధిని కనలేం అన్నట్లు కొందరి వ్యవహారం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
US-Iran War: టార్గెట్ ‘‘ఖార్గ్ ఐలాండ్’’.. భూతల దాడులకు అమెరికా సిద్ధం..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హృదయవిదారక ఉదంతాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రముఖ రేమండ్స్ సంస్థ అధినేత, పద్మభూషణ్ గ్రహీత విజయ్ సింహానియా జీవితంలో జరిగిన విషాదకర సంఘటనను ఆయన గుర్తుచేశారు. వందల కోట్ల ఆస్తులను కుమారుడికి గిఫ్ట్ డీడ్ ద్వారా రాసిచ్చిన తర్వాత, అదే కుమారుడు తన తండ్రిని సొంత ఇంటి నుండి గెంటేసి, కనీసం కారు, వంటవాళ్లు కూడా లేకుండా వీధిలోకి నెట్టేసిన వైనాన్ని వివరించారు. “పిల్లలకు సర్వస్వం రాసి ఇచ్చి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రి నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు” అని సింహానియా తన ఆత్మకథ ‘ఆన్ ఇన్కంప్లీట్ లైఫ్’లో రాసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి దుస్థితి రాకూడదని సీఎం ఆకాంక్షించారు. పురాణాల్లోని మాతృ పితృ భక్తుడు శ్రవణ కుమారుడి కథను ఆదర్శంగా తీసుకోవాలని, కానీ నేటి సమాజంలో కొందరు యంత్రాల్లా మారి పేగు బంధాలను విస్మరించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కొత్త బిల్లు ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుండి గరిష్టంగా నెలకు 10,000 రూపాయల వరకు భృతిని మినహాయించి తల్లిదండ్రులకు అందిస్తారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ 2007 చట్టం నిబంధనల మేరకు ఈ పరిమితిని నిర్ణయించినప్పటికీ, భవిష్యత్తులో ఈ మొత్తాన్ని పెంచేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సమాజంలో నైతిక విలువలను పునరుద్ధరించడానికి , వృద్ధుల హక్కులను కాపాడటానికి ఈ బిల్లు ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేవలం చట్టం ద్వారానే కాకుండా, సామాజిక మార్పు ద్వారా తల్లిదండ్రులకు గౌరవం దక్కాలని, ఈ బిల్లును పక్షపాత రహితంగా ఏకగ్రీవంగా ఆమోదించి సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపాలని ఆయన సభను కోరారు.
