ప్రభుత్వ ఆసుపత్రులకు నాణ్యమైన వైద్య పరికరాలను (మెడికల్ ఎక్విప్మెంట్) వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా ప్రొక్యూర్మెంట్ (కొనుగోలు) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కోటిలోని టీజీఎంఎస్ఐడీసీ (TGMSIDC) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైద్య పరికరాల కొనుగోళ్లు, టెండర్ల ప్రక్రియ, పరికరాల పనితీరు, మెయింటెనెన్స్ , కొత్త ఆసుపత్రులకు అవసరమైన సదుపాయాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే ప్రతి పరికరం నాణ్యమైనదిగా ఉండాలని, భవిష్యత్తులో కొనుగోళ్లన్నీ ఒకే విధమైన ప్రామాణిక విధానాల ప్రకారం జరగాలని స్పష్టం చేస్తూ, సరికొత్త విధానానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజేషన్
వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియలో మరింత జవాబుదారీతనం, సామర్థ్యం పెంచేందుకు ఈ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ‘ఎండ్-టు-ఎండ్ డిజిటల్ టూల్’ను త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలన్నారు. దీని ద్వారా ఇండెంట్ పెట్టినప్పటి నుండి ఆసుపత్రిలో పరికరం ఇన్స్టాలేషన్ అయ్యే వరకు ప్రతి దశను ఆన్లైన్లో సులభంగా ట్రాక్ చేసే వీలుంటుందని తెలిపారు. అలాగే, ఆసుపత్రులలోని పరికరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించేందుకు ఒక ‘సెంట్రలైజ్డ్ డ్యాష్బోర్డ్’ ఏర్పాటు చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో దీనిపై సమీక్ష జరపాలని ఆదేశించారు.
నిబంధనల ఉల్లంఘనపై కఠిన పెనాల్టీలు.. కొత్తగా బయోమెడికల్ ఇంజినీర్ల నియామకం
ప్రస్తుతం అమలులో ఉన్న కాంప్రహెన్సివ్ యాన్యువల్ మెయింటనన్స్ కాంట్రాక్ట్ (CAMC) అగ్రిమెంట్లను పునఃసమీక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. సర్వీస్ లెవల్ అగ్రిమెంట్స్ (SLAs) పాటించకుండా నిర్లక్ష్యం వహించే వెండర్లపై కఠినమైన పెనాల్టీలు (జరిమానాలు) విధించేలా నిబంధనలను సవరించాలన్నారు. క్షేత్రస్థాయిలో మెడికల్ ఎక్విప్మెంట్ పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది బయోమెడికల్ ఇంజినీర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. వీరిలో హైదరాబాద్ రీజియన్కు నలుగురిని, అలాగే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ జోన్లకు ఒక్కొక్కరిని చొప్పున కేటాయించి మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.

