Telangana : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TG BIE) సైన్స్ విద్యార్థుల సిలబస్, పరీక్షా విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రాక్టికల్స్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. నూతన విధానం ప్రకారం ఇకపై ఇంటర్ ఫస్టియర్ (ప్రథమ సంవత్సరం) సైన్స్ విద్యార్థులకు కూడా 15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే సెకండియర్ (ద్వితీయ సంవత్సరం) విద్యార్థులకు కూడా 15 మార్కుల ప్రాక్టికల్ పరీక్ష కొనసాగుతుంది. అయితే థియరీ పరీక్షలు మాత్రం ఎప్పటిలాగే 60 మార్కులకే ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్ పరీక్షలు రెండింటినీ బాహ్య పరీక్షలుగానే (External Exams) బోర్డు నిర్వహిస్తుంది.
వెబ్సైట్లో ల్యాబ్ మాన్యువల్స్.. నిబంధనలు ఇవే
నూతన విధానానికి అనుగుణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల ల్యాబ్ మాన్యువల్స్ను టీజీబీఐఈ (TG BIE) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ల్యాబ్ మాన్యువల్స్లో ప్రాక్టికల్ సిలబస్, మోడల్ ప్రశ్నాపత్రాలు, నెలవారీ షెడ్యూల్ను పొందుపరిచారు. వార్షిక అకాడమిక్ ప్రణాళిక ప్రకారం కళాశాలల్లో ప్రాక్టికల్ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలని, విద్యార్థులందరూ నిర్దేశిత ప్రయోగాలను ఖచ్చితంగా పూర్తి చేయాలని బోర్డు ఆదేశించింది. పరీక్ష సమయంలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రిన్సిపాల్/లెక్చరర్ చేత ధృవీకరించిన (Certified) ప్రాక్టికల్ రికార్డు పుస్తకాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
గంటన్నర పరీక్ష.. ల్యాబ్ సేఫ్టీ తప్పనిసరి
ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్షను 15 మార్కులకు గానూ గంటన్నర (1:30 గంటలు) వ్యవధిలో నిర్వహిస్తారు. ఇంటర్ బోర్డు నియమించిన బాహ్య పరీక్షాధికారుల (External Examiners) పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ముగిసిన వెంటనే మార్కులను బోర్డు నిర్దేశించిన గడువులోపు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం కళాశాల ల్యాబ్లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, మైక్రోస్కోపులు తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచాలని, ల్యాబ్ భద్రతా నిబంధనలను (Safety Rules) తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన అన్ని రికార్డులను కళాశాలలు భద్రపరచాలని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రాక్టికల్స్ నిర్వహణలో ఎలాంటి మాల్ప్రాక్టీస్ లేదా పరీక్షా నిబంధనల ఉల్లంఘన జరిగినా సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటారు. కళాశాలలో ప్రాక్టికల్ తరగతులు సజావుగా సాగడానికి, నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణకు ఆయా కళాశాల ప్రిన్సిపాల్దే పూర్తి బాధ్యత అని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తేల్చి చెప్పింది.

