తెలంగాణలో వర్షాకాలం ఊపందుకుంది. రాష్ట్రాన్ని ముసురు ఆవహించడంతో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా మారే సూచనలు కనిపించడంతో ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
ఉత్తర తెలంగాణలో అతిభారీ వర్షాలు – జగిత్యాలలో అత్యధికం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా నమోదవుతుండగా, అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 19 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు, స్థానిక అధికారులను వాతావరణ కేంద్రం ముందస్తుగా అప్రమత్తం చేసింది. వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
జూరాలకు ప్రవాహం.. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులు నిండుకుండలా
ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జూరాల వద్ద పరిస్థితి చూస్తే.. ఇన్ఫ్లో 21,000 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ఫ్లో 32,806 క్యూసెక్కులుగా ఉంది. వరద తాకిడి స్థిరంగా ఉండటంతో భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు అధికారులు నీటి విడుదల ప్రారంభించారు. దీనితో పాటు కుడి, ఎడమ కాలువలకు కూడా సాగు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలకు వర్ష సూచన ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యంత్రాంగం హెచ్చరించింది.

