Telangana Heatwave : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణీ కార్తె ప్రవేశించిన వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తెలంగాణ ప్రణాళికా సంఘం (TGDPS) మే 25న విడుదల చేసిన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత 45 డిగ్రీల నుండి ఏకంగా 46.5 డిగ్రీల సెల్సియస్కు చేరడంతో జనం ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే మొదలవుతున్న ఎండ తీవ్రత, మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
రాష్ట్రంలోనే అత్యధికంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీనితో పాటు సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లో 46.4 డిగ్రీలు, నల్గొండ, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 46.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో 46.2 డిగ్రీలు, జగిత్యాలలో 46.1 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో 45.9 డిగ్రీలుగా ఎండ తీవ్రత నమోదైంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేసి రెడ్ అలర్ట్ పరిధిలోకి వచ్చేశాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే.. నగరంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చుట్టుపక్కల ఉండే మేడ్చల్-మల్కాజ్గిరిలో 42.4, రంగారెడ్డిలో 43.1, సంగారెడ్డిలో 42.1 డిగ్రీల చొప్పున ఎండలు ఉన్నాయి. కేవలం నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్రమే నిన్నటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదై కాస్త ఉపశమనం కలిగించాయి. అయితే, రాబోయే మూడు రోజుల వాతావరణ ముందస్తు సూచనలు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవు. రానున్న రోజుల్లో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాల్లో ఎండలు మరింత ముదిరి 45.7 డిగ్రీల వరకు వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యం గా మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
