Site icon NTV Telugu

Group1 : గ్రూప్‌-1 తీర్పుపై హైకోర్టులో మరోసారి అప్పీల్‌ దాఖలు

Group 1

Group 1

Group1 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీలు చేసిన నేపథ్యంలో, తాజాగా గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

మార్చి 10న విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, ఈ నెల 9న కీలక తీర్పు ఇచ్చారు. ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు, మార్కుల జాబితాను రద్దు చేశారు. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది.

సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వాదనలను సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటూ డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. ఫలితాలు సక్రమంగానే ఉన్నాయని, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలులోకి వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని టీజీపీఎస్సీ వాదిస్తోంది.

తాజాగా, గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేశారు. తన నియామకం చట్టబద్ధమని, ఇప్పటికే పొందిన హక్కును కోర్టు తీర్పుతో రద్దు చేయరాదని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్‌ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

ఒకవైపు టీజీపీఎస్సీ, మరోవైపు ఎంపికైన అభ్యర్థి చేసిన అప్పీల్స్‌తో గ్రూప్-1 వివాదం మరింత క్లిష్టంగా మారింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏ తీర్పు ఇస్తుందో అన్నది రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులలో ఆసక్తిని రేపుతోంది. ఈ కేసు తుది పరిష్కారం వచ్చేంతవరకు నియామకాలు నిలిచిపోవడం ఖాయమని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

Italy: ఇటలీలో పాలస్తీనా ప్రకంపనలు.. హింసాత్మకంగా మారిన నిరసనలు

Exit mobile version